సనా, సెప్టెంబర్ 11 : ప్రపంచానికి మరో చమురు షాక్ పొంచి ఉంది. ఇప్పటికే అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హొర్ముజ్ జలసంధిలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటింది. గ్యాస్, పలు నిత్యావసరాల రవాణాకు ఆటంకం ఏర్పడింది. తాజాగా, ప్రపంచంలోని 12 శాతం సరుకు రవాణా జరిగే బాబ్ ఎల్ మాండెబ్ జలసంధిలో జరిగే ఎగుమతి, దిగుమతులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడింది. ఈ జలసంధిపై హౌతీలు నెమ్మనెమ్మదిగా పట్టుసాధిస్తూ అగ్రరాజ్యం అమెరికా సహా, ప్రపంచ దేశాలను సైతం భయపెట్టే పరిస్థితిని తెస్తున్నారు. యెమెన్-జిబేతీల మధ్య ఎర్రసముద్ర ముఖద్వారం వద్ద ఉన్న ఈ ఇరుకైన జలమార్గం పశ్చిమాసియాలోని గణనీయమైన చమురు రవాణాకు ఒక సురక్షిత మార్గంగా ఉండేది.
అయితే ఆ పరిస్థితి బలహీనపడుతున్నట్టు కన్పిస్తున్నది. ఇరాన్ మద్దతు కలిగిన యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు గత కొన్ని వారాలుగా బాబ్ అల్-మాండెబ్ జలసంధి గుండా సాగే నౌకాయానానికి ముప్పు కలిగిస్తున్నారు. గత 48 గంటల్లో వారు ఈ నౌకాయాన మార్గంపై గణనీయంగా పట్టుబిగించారు. వారు గురువారం మోచారేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ కీలకమైన సముద్ర మార్గ మధ్యలో ఉన్న వ్యూహాత్మక పెరిమ్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా, అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో యుద్ధం ముగుస్తుందని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది.
హొర్ముజ్ జలసంధి ద్వారా ఇప్పటికే గల్ఫ్ రవాణాపై పలు ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో హౌతీల చర్య ఎర్రసముద్ర రవాణాకు మరింత ముప్పును కలిగించవచ్చునని, ఎర్రసముద్రంపై నౌకల రాకపోకలను వీరు నియంత్రించే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఎందుకంటే ఎర్రసముద్రం మీదుగా జరిగే నౌకాయానాన్ని నియంత్రించడంలో మోచా కీలకమైనది. ఈ నగరం ఎర్రసముద్రం, ఏడెన్ అఖాతంలను కలిపే బాబ్ ఎల్ మాండెబ్ జలసంధికి 80 కి.మీ దూరంలో ఉంది. మోచా నగర స్వాధీనంతో ప్రపంచంలోని అత్యంత కీలక జలసంధులలో ఒకదానికి దారితీసే మార్గాలపై హౌతీలకు ప్రత్యేక ఉనికి లభించిందని యుద్ధ నిపుణులు అంటున్నారు.