సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని అమలు చేసే యోచనలో సిటీ పోలీసులున్నారు. కొన్ని రూట్లను ఎంచుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలనే ఆలోచనలో ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు సరి-బేసి విధానంపై నగర పోలీస్ వర్గాలలో చర్చ నడుస్తున్నది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విధానాన్ని కొన్నాళ్లు అమలు చేశారు.
కాలుష్యం తగ్గడంతో పాటు ట్రాఫిక్ కూడా తగ్గుముఖం పట్టింది. తాజాగా సీపీ నోట ఈ మాట రాగానే హైదరాబాద్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. కరోనా తరువాత వ్యక్తిగత వాహనాల వాడకం ఎక్కువ కావడంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగింది. దీనికి కారు పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు వినియోగం పెంచితే కొద్దిగా అడ్డుకట్ట వేసే అవకాశముంటుందని సీపీ ప్రస్తావించారు. గతంలో హైదరాబాద్లో తిరిగేందుకు ఆటోలకు పరిమితులతో కూడిన రిజిస్ట్రేషన్లు ఉండేవని, రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటూ దీనిని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు.
సరి-బేసి విధానంలో వాహనం నెంబర్ ప్లేట్లోని చివరి అంకెలు సరి సంఖ్యలు ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్యలు ఉన్న వాహనాలు మరొక రోజు రోడ్లపైకి అనుమతిస్తారు. అయితే ఇది హైదరాబాద్ మహానగరంలో సాధ్యమవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.