పీర్జాదిగూడ, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు చర్యలు చేపట్టడంతో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని గూడెం చెరువు (పెద్ద చెరువు) మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకున్నది. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు దుర్గంధం వెదజల్లడంతో పాటు రోజు రోజుకు కుచించుకు పోతుండటంతో అధికారులు చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. రూ.13 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, పూల మొక్కలు, వాకింగ్ ట్రాక్తో సందర్శకులను ఆకట్టుకుంటున్నది. మేయర్ జక్క వెంకట్ రెడ్డి నిత్యం అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ, అధికారులకు సూచనలు ఇస్తూ.. సకల వసతులతో కూడిన మినీ ట్యాంక్ బండ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి ప్రారంభించిన మినీట్యాంక్ బండ్ ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలుస్తున్నదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
గూడెం చెరువుకు పర్యాటక శోభ తీసుకువచ్చేందుకు నిత్యం శ్రమించారు. చెరువులోకి ఎగువ ప్రాంతాలనుంచి వచ్చే డ్రైనేజీ నీటిని మూసీలోకి తరలించేందుకు కాలువలు, చెరువు చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మించారు. చెరువుకట్టపై ఆహ్లాదంతో పాటు పచ్చదనంతో కూడిన వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా బతుకమ్మ ఘాట్, దసరా పండుగ జరుపుకునేందుకు విశాలమైన ప్రదేశం, స్వాగత తోరణం, పిల్లలకు క్రీడా మైదానం, ఓపెన్ ఎయిర్ జిమ్, వ్యూపాయింట్, హైమాస్ లైట్లు, వాకింగ్ట్రాక్, పార్కింగ్ వివిధ రకాల పూలమొక్కలతో సుదరంగా తీర్చిదిద్దారు. మురుగునీటిని పూర్తిగా తొలగించారు.
రూ.13కోట్లతో పీర్జాదిగూడ పెద్ద చెరువును తీర్చిదిద్దాం. చెరువును పర్యాటక ప్రాంతంగా మార్చాం. పీర్జాదిగూడకు మణిహారంగా నిలిచింది. ఆహ్లాదంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేలా రూపుదిద్దుకున్నది. ఇప్పుడు పర్యాటక శోభ తలపిస్తుంది.
– మేయర్ జక్కవెంకట్రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్