సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్కు అలవాటు పడి ఆ తరువాత డ్రగ్ పెడ్లర్గా మారిన ఓ యుకువడిని కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేయగా డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గ్యాంగ్కు చెందిన మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నారు. మాదాపూర్ పోలీసులు, ఎస్వోటీ కూకట్పల్లి పోలీసులు.. చంద్రనాయక్ తండాలోని ఒక అపార్టుమెంట్పై దాడి చేశారు. అందులో విజయవాడకు చెందిన ధనేకుల తరుణ్ తేజ ఎండీఎంఏ డ్రగ్స్తో పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఎండీఎంఏ, ఓజీ కుష్ గంజా డ్రగ్ను విజయవాడ నుంచి తెప్పించి, హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు.
విజయవాడ నుంచి కార్తీక్, పృథ్వీలు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలపడంతో ఆ ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అపార్టుమెంట్లో 8 మంది నిరుద్యోగ యువకులకు తరుణ్ తేజ్ డ్రగ్స్ సరఫరా చేయడంతో డ్రగ్స్కు అలవాటు పడ్డారని పోలీలీసుల విచారణ వెల్లడైంది. నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 15 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 382 గ్రాముల ఓజీ కుష్ గంజా, 9 మొబైల్ ఫోన్లు, రెండు వెయింగ్ మిషన్లు, డ్రగ్ సేవించే పరికరాలు, డ్రగ్ ప్యాకింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.