కీసర, ఫిబ్రవరి 8: కీసరగుట్ట శ్రీ భవానీరామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరువతో ఓ వైపు జిల్లా యంత్రాంగం, మరోవైపు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో గుట్టలో జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం సుమారుగా 6 నుంచి 7లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఆన్లైన్లో దర్శనం టికెట్లు
గతంలో వీఐపీ టిక్కెట్ల ద్వారా ఎదుర్కొన్న ఇబ్బందు ల దృష్ట్యా ఈ సంవత్సరం నుంచి వీఐపీ టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఆధ్వర్యంలో ఆన్లైన్ టిక్కెట్ల ద్వారా దర్శనం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మంత్రి సమక్షంలో ఆన్లైన్కు సంబంధించిన వెబ్సెట్ను ప్రారంభించారు.ఆన్లైన్ ద్వారా సుమారు రూ.500చెల్లిస్తే కుటుంబమంతా దర్శ నం చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. దాంతో పాటు ఈ సంవత్సరం కొత్తగా పార్కింగ్ కోసం ఆన్లైన్ టెండర్ ద్వారానే నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.
భారీగా పోలీసు బందోబస్తు
కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ పోలీసు సిబ్బందితో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కీసరగుట్టలోని పార్కిం గ్ స్థలాన్ని, కంట్రోల్ రూం కోసం ఏర్పాటు చేసే స్థలాన్ని ఆయన పర్యవేక్షించారు. కీసరగుట్టలో అడుగడుగునా సీసీ కెమెరాలు, ఆలయానికి వచ్చే భక్తులు సులువుగా దర్శించుకోవడానికి పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ ప్రకటించారు.ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న జంటనగరాల్లోని ఆర్టీసీ అధికారులతో కలిసి కీసరగుట్టలో పర్యటించారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం కోసం కీసరగుట్టకు సుమారు 200 ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. అదేవిధంగా బ్రహోత్సవాల సందర్భంగా ప్రాకార మండపానికి రంగులతోపాటు తూర్పు రాజగోపురం మెట్టు మిగులు పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం రమేశ్శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి సుధాకర్రెడ్డి తెలిపారు.
వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేయండి
కీసరలో వాహనాల పార్కింగ్ వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. కీసరగుట్టలో బుధవారం పార్కింగ్ స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్, మండల అధికారులు, ఆలయ చైర్మన్ రమేశ్శర్మతో కలిసి పర్యటించారు. కీసరగుట్ట కింది భాగం మూలమలుపు నుంచి రెసిడెన్షియల్ స్కూల్ వెనుకభాగం వరకు గల స్థలాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలుకుండా అధికారుల పార్కింగ్ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్ల వద్ద గట్టి పోలీసుబందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రమేశ్శర్మ, ఎంపీడీవో కె. రమాదేవి, సర్పంచ్ మాధురి వెంకటేశ్, ఎంపీవో మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.