హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను భక్తులు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25న సికింద్రాబాద్ బోనాల సందర్భంగా శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రానున్నందున పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
దర్శనం సమయంలో తోపులాటకు ఆస్కారం లేకుండా బారికేడ్లు ఏర్పాటుతోపాటు వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. భద్రతను పర్యవేక్షించేందుకు పోలీసుశాఖ అదనపు పోలీసు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. మంత్రి వెంట జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, కార్పొరేటర్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఏసీపీ రమేష్, వినోద్ కుమార్, సీఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.