బేగంపేట్ జూన్ 23: జూలై 17న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద ప్రభుత్వ వివిధ శాఖల అధికారులతో గురువారం కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాటా నుంచి రాంగోపాల్పేట పాత పోలీస్స్టేషన్ వరకు చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణం, ఆలయ పరిసరాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఎంతో ప్రసిద్ధి చెందిన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని, ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల తోపులాట లేకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. అదే విధంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
అమ్మవారికి బోనాలు తీసుకువచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని పోలీస్, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మళ్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తులకు మంచినీటి ప్యాకెట్లు బాటిళ్లను అందుబాటులో ఉంచాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, దేవాలయంల ఈవో గుత్తా మనోహార్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ గంగారెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిష్టొఫర్, మహంకాళి ఏసీపీ రమేశ్, మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా గౌడ్, ఆలయ ట్రస్టీ సురిటీ కామేశ్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.