శేరిలింగంపల్లి, డిసెంబర్ 23: గచ్చిబౌలి డివిజన్లోని గోపన్పల్లి తండా, నలగండ్ల గ్రామాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెలేయ అరెకపూడి గాంధీ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. గచ్చిబౌలి డివిజన్లో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోపన్పల్లి తండాలో రూ.170 లక్షల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో తుదిదశ మెరుగులు దిద్దుకుంటున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాలు నిర్మాణ పనులు, గోపన్తండా కాలనీలో రూ.కోటి అంచనా వ్యయంతో కొనసాగుతున్న సీసీరోడ్డు నిర్మాణ పనులు, నలగండ్ల హుడాకాలనీలో రూ.260 లక్షల వ్యయంతో కొనసాగుతున్న థీమ్పార్కు పనులను ఆయన సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం త్రిశాల అపార్టుమెంట్స్, హిమసాయి అపార్టుమెంట్లను సందర్శించి స్థానికంగా అపార్టుమెంట్వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వర్షం నీరు, డ్రైనేజీ నీరు బయటకు వెళ్లేందుకు సరైన అవుట్లెట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసుల విజ్ఞప్తుల మేరకు ఆయన పరిస్థితిని స్యయంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారులు ఈఈ బీవీరావు, డీఈ పద్మజ, శేరిలింగంపల్లి సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఎస్ఈ శంకర్నాయక్, ఈఈ శ్రీనివాస్, డీఈ విశాలాక్షి, బీఆర్ఎస్ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.