సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఓ మట్టి గణపయ్యా.. నీ బంటు నేనయ్యా, రంగులొద్దు.. హంగులొద్దు, ప్రకృతి హితాన్ని కోరే విధంగా పండుగలను జరుపుకుంటేనే పరమార్థం ఉందంటున్నారు రోటరీ క్లబ్ సభ్యులు. మట్టితోనే చేద్దాం.. మన గణపయ్యను, మన ఇంటిలోనే నిమజ్జనం చేద్దాం అంటూ నినదిస్తున్నారు. రంగు విగ్రహాలను మానేద్దాం-మట్టి గణపతినే పూజిద్దాం-పర్యావరణాన్ని (నీటి వనరులను) కాపాడుకుందాం అంటూ ముందుకు సాగుతున్నారు. పర్యావరణ పరిరక్షణ-మనందరి బాధ్యత అని విడమర్చి వివరిస్తున్నారు. గంగ కన్నీరు పెడితే.. గణపతికి బాధ కాదా అంటూ తమకు తాము ప్రశ్న వేసుకోవాలని సూచిస్తున్నారు. మట్టి వినాయకుడిని పూజిస్తేనే పర్యావరణానికి శ్రేయస్కరమని నగర ప్రజలను రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ సభ్యులు చైతన్య పరుస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 13 ఏండ్లుగా గ్రీన్ గణేశుడినే కొలవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ.. రొటేరియన్ విజయభాస్కర్ నేతృత్వంలో ఉద్యమంలో హరిత గణపతులపై అవగాహన కల్పిస్తున్నారు. కేపీహెచ్బీకాలనీ, వసంతనగర్, భగత్సింగ్నగర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల నుంచి మొదలైన కార్యక్రమం గ్రేటర్ వ్యాప్తంగా విస్తరించారు. పర్యావరణం కాలుష్యం కాకూడదని, ప్లాస్టర్ ఆఫ్ పారీస్తో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ భవిష్యత్తు తరాలకు హాని చేకూరే విధంగా ప్రవర్తించకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ‘గ్రీన్ గణేశా’ మిషన్ 2023 పేరుతో మట్టి ప్రతిమలపై అవగాహన కల్పిస్తున్నారు.
పర్యావరణానికి హాని చేకూరే పద్ధతులను త్యజించాలని, క్లేతో తయారు చేసిన లంబోధరుడినే పూజించాలని వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తున్నారు. హరితం.. సతతం.. అనే నినాదంతో హరిత మట్టి గణేశులను నెలకొల్పాలని పలు పాఠశాలలు, కళాశాలలు, కూడళ్లు, అసోసియేషన్ల సభ్యులను, ఇంటిల్లి పాదితో పాటు భక్తులను ఒకచోట చేర్చి అవగాహన కల్పిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ లాంటి సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడమే కాకుండా ఈమెయిల్, బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా మట్టి గణపతుల ప్రాధాన్యతను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం 7లక్షల కుటుంబాలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 రొటేరియన్ విజయ భాస్కర్ తెలిపారు.
నూటికి నూరు శాతం మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలి. ప్రెసిడెంట్ జి.శివశంకర్ రావు, సెక్రటరీ డాక్టర్ కె.శ్రీనివాస రావు ఆధ్వర్యంలో 6 అంగులాల నుంచి 7.8 అడుగుల వరకు మట్టి ప్రతిమలను తయారీ చేస్తున్నాం. విగ్రహాలను ఉచితంగా అందజేస్తుంటే ప్రతిమల విలువ తెలియడం లేదు. అందుకే ఉత్పత్తికి ఎంత ఖర్చు అవుతుందో ఆ చార్జిలతో ప్రతిమలను అందజేస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నెలకొల్పడం వల్ల భవిష్యత్తు తరాలు విషతుల్యమవుతాయి. ఎకో నిమజ్జనాన్ని బకెట్ నీటిలో గాని, ఫ్లవర్ పాట్, స్విమ్మింగ్ పూల్, జీహెచ్ఎంసీ నిర్మించిన గణపతి నిమజ్జన ఘాట్లో నిమజ్జనం చేసి నీటి వనరులకు కాపాడుకోవాలని వినాయకుడి భక్తులకు విజ్ఞప్తి. వివరాలకు http://www. rotary3150.org లో సంప్రదించండి.
– రొటేరియన్ విజయ భాస్కర్