సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): సిటీ ఠాణాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కన్పించకపోవడమే కాకుండా.. వచ్చిన బాధితులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులను అప్యాయంగా పలుకరిస్తూ.. మీ కోసం మేమున్నామంటూ వారిలో ధైర్యం నింపాల్సిన పోలీసులు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఠాణాలలో అంతా ట్రెండ్ మారింది. స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చే వారిని నిలబెట్టి మాట్లాడడం.. అదే ఆరోపణలు ఎదుర్కొనే(నిందితులను) కూర్చొబెట్టి మాట్లాడడం.. దళారీ కేసు నమోదు చేయడమంటేనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే పరిస్థితి నెలకొంది. నగర పోలీస్ కమిషనర్ తన బాధ్యతలు తీసుకున్నప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతో ఫ్రెండ్లీగా.. తప్పు చేసిన వారితో కఠినంగా ఉంటామంటూ చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా కొన్ని పోలీస్స్టేషన్లలో సిబ్బంది నడుచుకుంటున్నారు. సౌత్జోన్ పరిధిలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదు చేయాలంటే ఏదో నాయకుడి వద్దో.. స్టేషన్ల వద్ద తిరిగే దళారుల సహకారం తీసుకోవాలి. నిందితులు కూడా నాయకులు, దళారుల సహకారం తీసుకొని ఠాణాలకు వస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు దళారుల మాయలో పడుతూ కేసులు నమోదు చేయకుండా.. సెటిల్మెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
సౌత్జోన్ పరిధిలోని ఓ పోలీస్స్టేషన్కు ఓ మహిళ శనివారం ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. మేకల వ్యాపారంలో పెట్టుబడి పెడుతామంటూ డబ్బులు తీసుకొని కొన్నాళ్లు ఇచ్చి, ఆ తరువాత మోసం చేశారంటూ ఆమె ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వెళ్లింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మేం పిలిపించి మాట్లాడుతామంటూ ఆమెను పంపించేశారు. మరుసటి రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫరీసా పైరవీకారులతో కలిసి స్టేషన్కు వెళ్లింది. ఆదివారం స్టేషన్కు వెళ్లి మాట్లాడుకొని వెళ్లిపోయారు. సోమవారం మరోసారి బాధితురాలు స్టేషన్కు వెళ్లింది.. అప్పుడు తిరిగి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ దళారులతో కలిసి వెళ్లి స్టేషన్లో ఉన్న ఎస్సైతో మాట్లాడింది. ఈ సందర్భంగా బాధితురాలు నిలబడి మాట్లాడుతుండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కూర్చొని సమాధానాలు చెబుతుంది. అయితే ఇక్కడ కనీసం ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పోలీసులు దళారులతో చేతులు కలపడంతో బాధితురాలినే నిందితురాలిగా ట్రీట్ చేయడం వివాదాస్పదమయ్యింది.
నగర కమిషనరేట్లో పనిచేస్తున్న చాలా మంది సిబ్బంది ఎన్నికల సందర్భంగా బదిలీలపై వచ్చిన వాళ్లున్నారు. అందులో కొందరికి సిటీ పోలీసింగ్పై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోడవం సహజమే. దళారులు కొందరు రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్లు ఉంటున్నారు. ఎవరికి ఏ రాజకీయ నాయకుడితో సంబంధాలున్నాయో అనే బావనతో వచ్చిన వారందరికీ ఇలా మర్యాద ఇస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు మనమున్నామనే భరోసాను మర్చిపోవడం ఆందోళన కల్గిస్తుందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్టేషన్లలోని సిబ్బందికి అవగాహన కల్పించాలి వారి ప్రవర్తన మార్చాల్సిన అవసరముందని నగర వాసులు కోరుతున్నారు.