హైదరాబాద్: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ఆంధ్రా పోలీసులు (AP Police) పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు బాచుపల్లిలో (Bachupally) గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో బాచుపల్లిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ కారులో (ఏపీ39క్యూహెచ్ 1763) 11 ప్యాకెట్లలో 22 కేజీల గంజాయి (Ganja) లభించింది. దీని విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని విచారించగా తాము ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో పనిచేస్తున్నామని తెలిపారు. కాకినాడలోని మూడో బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన హెడ్కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ అని వెల్లడించారు. ఆరోగ్య కారణాలను చూపి సెలవులు పెట్టామని, గంజాయి స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.