బీఆర్ఎస్ పార్టీ.. ప్రజా సంక్షేమం కోసం పని చేసే పార్టీ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మోండా డివిజన్ ఆదయ్యనగర్ క్రీడా మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండావిష్కరణ అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
మారేడ్పల్లి, మార్చి 20 : ప్రజా సంక్షేమం కోసం పని చేసే పార్టీ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం మోండా డివిజన్ ఆదయ్యనగర్ క్రీడా మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి తలసాని శ్రీని వాస్ యాదవ్ హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రారంభించినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పథకాలను అమలు చేసిందని, త్వరలో గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. కోట్లాది రూపాయాల వ్యయంతో ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అన్ని వర్గాల పండగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు. కొన్ని పార్టీలు కులాలు, మతాల పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సనత్నగర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలలో 85 శాతంకు పైగా ఇప్పటికే పరిష్కారానికి నోచుకున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అరుణ, ఆకుల రూప, నామన శేషుకుమారి, బీఆర్ఎస్ నాయకులు నాగులు, జయరాజ్, తలసాని స్కైలాబ్ యాదవ్, రాములు తదితరులు పాల్గొన్నారు.
టీఎస్పీఎస్సీ నుంచి పేపర్ లీకేజీలో ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయాలని ఎంతో పారదర్శకంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నియమాకం చేపట్టిందన్నారు. ఇప్పటికే 1.30 లక్షల నియమాకాలు జరిగాయని, మరో 80 వేల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లను దశల వారిగా జారీ చేస్తుందని చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగ యువత పై వారికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వం విచారణ జరుపుతుందని, ఇందుకు బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.