సిటీబ్యూరో, జనవరి 12 ( నమస్తే తెలంగాణ ) : నువ్వా.. నేనా అన్నట్టుగా.. రణరంగంలో బలీయమైన కోళ్లు జూలు విదిల్చి కాళ్లకు కట్టిన కత్తులతో పోటీల్లో చెలరేగిపోతుంటే.. ఆ దృశ్యం చూడటానికి పందెం రాయుళ్ల ఆరాటం అంతా ఇంతా కాదు. ఆ కోళ్ల గెలుపోటములపై కోట్ల రూపాయల బెట్టింగ్ ఆధారపడి ఉంటుంది. కొందరు ఈ పోటీలను డబ్బులు రాబట్టుకోవడానికి చూస్తే.. మరికొందరు ప్రతిష్ట కోసం ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే నిషేధం, కఠిన చర్యలు, జైలు శిక్షలు వంటి మాటలు ఎన్ని ఉన్నా.. ప్రజల్లో తరాలుగా నాటుకుపోయిన సంస్కృతి మాత్రం ఇంకా జోరందుకుంటుండటం విశేషం.
అందులో భాగంగానే హైదరాబాద్ శివారులోని పలువురి వ్యవసాయ క్షేత్రాల్లో ఏడాది కాలంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చి పెంచిన కోళ్లను పోటీల్లో దింపేందుకు సీమాంధ్రకు తీసుకువెళ్తున్నారు. మరికొందరు సొంతంగా పెంచుకున్న కోళ్లను, ఇంకొందరు కోళ్ల ఫామ్స్లో పెంచిన వాటిని వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ముఖ్యంగా గౌడ నెమలి, తెల్ల నెమలి, కోడి నెమలి, కాకి డేగ, కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్, ఎర్రడేగ వంటి జాతులను పందెంలో దింపేందుకు ఎంచుకుంటున్నారు. దీంతో ప్రజా ప్రతినిధుల నుంచి సినీ తారల వరకు అందరూ సంక్రాంతి కోడి పందెంల పోరుబాట పట్టారు. ఇప్పటికే ఇక్కడి వారి ప్రయాణాలతో అక్కడి ప్రాంతాల్లోని లాడ్జీలు, హోటల్స్, రెస్టారెంట్స్లలో బుకింగ్స్ ఫుల్ అయ్యాయి.