యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త.. తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కపాడే లక్ష్మీ అమ్మ వారికి విశేష పుష్పాలతో ఆలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా 516 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణ జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ముత్తయిదు వులు మంగళ హారతులతో అమ్మ వారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా నిత్యారాధనలు..
యాదాద్రి స్వామి వారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా కొనసాగాయి. తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాబిషేకంతో ఆరాధనలు ప్రారంభిం చారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీ సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీరోజు నిర్వహించే నిత్య తిరు కల్యాణోత్సంలో భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్న భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.