ORR | మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్పై ప్రయాణం ప్రతి ఒక్కరినీ కనువిందు చేస్తున్నది. వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు తీరొక్క అందాలతో ఔటర్ వినూత్నంగా స్వాగతం పలుకుతున్నది. ఒక్కో ఇంటర్చేంజ్ వద్ద ఒక్కో ఆకృతితో అపూర్వ స్వాగతం పలికేలా ఔటర్పై బ్యూటిఫికేషన్ పనులను హెచ్ఎండీఏ హెచ్జీసీఎల్ విభాగం అద్భుతంగా చేస్తున్నది. నార్సింగి పాయింట్ (ఓవర్ పాస్) వద్ద కాకతీయ కళాతోరణం, గచ్చిబౌలి వద్ద చేయి ఆకారం.. తాజాగా పుప్పాలగూడ-నార్సింగి రోడ్లో మీడియన్లో ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతులు ప్రయాణికులు, స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. అటుగా వెళ్లే చాలా మంది వీటి వద్ద నిల్చుని సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.
సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ): ఔటర్ ప్రయాణం కనువిందు చేస్తున్నది.. వివిధ జిల్లాల నుంచి ఔటర్ మీదుగా భాగ్యనగరంలోకి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు వినూత్న రీతిలో స్వాగతం పలికేలా హెచ్ఎండీఏ హెచ్జీసీఎల్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గచ్చిబౌలి వద్ద చెయ్యి ఆకారంతో ఏర్పాటు చేసిన ఆకృతి విశేషంగా ఆకట్టుకుంటున్నది. నార్సింగి పాయింట్(ఓవర్ పాస్) వద్ద కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేశారు. ఫైబర్గ్లాస్ మెటీరియల్తో దాదాపు రూ.3లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కళాతోరణం ఔటర్కు మరింత వన్నెను తీసుకువచ్చింది. శామీర్పేట, పటాన్చెరు వద్ద ఈ తరహా అందాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పుప్పాలగూడ-నార్సింగి రోడ్లో మీడియన్లో ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతులు ప్రయాణికులు, స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. ఆయా స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వీటిని ఏర్పాటు చేయగా.. అటు వెళ్లే చాలా మంది వీటి వద్ద నిల్చుని సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.
కాగా, రాజధాని మణిహారమైన ఔటర్ కేంద్రంగా నాగ్పూర్(ఎన్హెచ్ 44), బెంగళూరు(ఎన్హెచ్ 44), ముంబై(ఎన్హెచ్ 65), విజయవాడ(ఎన్హెచ్ 65) రహదారుల నుంచి నగరంలోకి చేరుకునే ప్రయాణికులకు అపూర్వ స్వాగతం పలికేలా ఔటర్లో బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. ఎక్కడ ఖాళీ ప్రాంతం కన్పించకుండా ల్యాండ్స్కేపింగ్ పనులు, ప్రత్యేక ఆకర్షణతో ఏర్పాటు చేస్తున్న శిల్పాలు, ఆకృతులు కనువిందు చేస్తున్నాయి.