అంబర్పేట, ఆగస్టు 30 : సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తాను చేసిన ప్రజాసేవే మళ్లీ తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేసిందని పేర్కొన్నారు. రెండోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కించుకున్న సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో పలు విషయాలను పంచుకున్నారు.
ప్రజల్లో ఉన్నానని..
2018లో ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి బస్తీ, ప్రతి కాలనీలో గడపగడపకూ తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నా. వాటికనుగుణంగా ప్రణాళికలు రూపొందించి పరిష్కారానికి కృషి చేశా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశా. కరోనా సమయంలో ఎంతో మందికి వారి పౌష్టికాహారం అందజేశా. పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇవన్నీ రెండోసారి టిక్కెట్టు రావడానికి కారణమయ్యాయి.
మౌలిక వసతులకు పెద్దపీట
నియోజకవర్గంలోని అన్ని బస్తీలు, కాలనీల్లో ప్రజాభిప్రాయం మేరకు అభివృద్ధి పనులు చేశాం. ప్రధానంగా జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్, హెచ్ఎండీఏ ద్వారా నిధులు తీసుకువచ్చి పనులు చేశా. మొదటి ప్రాధాన్యతగా బస్తీల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టా. నూతన డ్రైనేజీ వ్యవస్థను రూపొందించాం. కలుషిత మంచినీటి సమస్య లేకుండా కొత్త పైపులైన్ల ఏర్పాటు, బస్తీలు, కాలనీల్లో బీటీ, సీసీ, వీడీసీసీ రోడ్ల నిర్మాణం, పుట్పాత్ల ఆధునీకరణ, వరదనీటి పైపులైన్ నిర్మాణ పనులు, వరద ముంపునకు గురికాకుండా హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా వెంట ఎస్ఎన్డీపీ కింద నాలాల విస్తరణ చేపట్టా. పార్కుల సుందరీకరీకరణ పనులు చేపట్టి.. ఇప్పటికే కొన్ని కాలనీల్లో పార్కులను ప్రారంభించా. మరికొన్ని పార్కుల్లో పనులు జరుగుతున్నాయి. ఫీవర్ హాస్పిటల్ బ్రిడ్జి వద్ద వర్టికల్ గార్డెన్, శివం రోడ్డులో ఏసీ బస్టాపు ఏర్పాటు చేశా. అంబర్పేట శ్రీరమణ చౌరస్తా నుంచి అలీకేఫ్ వరకు సెంట్రల్ మెరిడియన్ పనులు చేపట్టా. నూతన విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు కూడా చేశాం. ఏ బస్తీలో చూసినా ఏదో ఒక అభివృద్ధి కనిపిస్తుంది. వీటికి తోడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్, దళితబంధు లాంటి సంక్షేమ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నా.
మంచి ఆదరణ ఉంది.. ప్రజలు మళ్లీ గెలిపిస్తారు..
నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల జనాల్లో మంచి స్పందన ఉంది. ఐదు డివిజన్లలో ఉన్న బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ అక్కడి ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నా. 20వేల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశాం. వంద మందికి దళితబంధు ఇచ్చాం. అవసరమున్న బస్తీలో బోరింగులు వేయించడం, పలు దేవాలయాల్లో అర్చకులకు గౌరవ వేతనం అందించడం, అంత్యక్రియలు ఉచితంగా చేయడం, విద్యాభ్యాసానికి సహాయం చేయడం, పార్టీ పట్ల, ఎమ్మెల్యేగా నా పట్ల మంచి ఆదరణ ఉందని భావిస్తున్నా. రెండోసారి టికెట్ ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు వచ్చి నాకు అభినందనలు తెలిపారు.
ప్రజలకు బీఆర్ఎస్పై విశ్వాసం ఉంది
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా వంటి కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు ఉచిత వైద్యం అందజేసింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్ల లాగా ముందుకు తీసుకెళ్తున్నది. విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు, అలాగే మహిళల రక్షణ కోసం షీటీమ్స్ను ఏర్పాటు చేసింది. ఇంకా అనేక పథకాలు ప్రజలకోసం అమలు చేస్తున్నది. ఇవన్నీ చూసిన ప్రజలకు ప్రభుత్వం పై గట్టి నమ్మకం ఏర్పడింది. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా దేశంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దడానికి విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వం పై ప్రజలకు మంచి విశ్వాసం ఉంది. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం.