మేడ్చల్, మార్చి 25(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సత్తెనాశ్.. బీజేపీ బట్టేబాజ్, దోకేబాజి పార్టీలు అని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అలియాబాద్లో శనివారం ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు చేసిందేమీ లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. దేశంలోనే కేసీఆర్ గొప్ప సీఎం అని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. రాష్ర్టాభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ను దేశప్రజలంతా దేశ రాజకీయాలకు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో స్థాపించిన బీఆర్ఎస్ పార్టీని చూసి ప్రధాని మోదీకి వణుకు పుడుతున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ని ప్రజలు ఇంటికి పంపిస్తారన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాగల్ అని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూర్ఖుడని వీరిద్దరికీ కాంగ్రెస్, బీజేపీ పార్టీల అధ్యక్షుల పదవులు ఎలా ఇచ్చారని ఎద్దేవా చేశారు.
రూ. 3 లక్షల ఆర్థిక సాయం
త్వరలోనే నిరుపేదల ఇండ్ల నిర్మాణాలకు రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని, దీనికి ప్రత్యేకంగా కమిటీని వేసి అర్హులైన వారందరికీ రూ. 3 లక్షలు అందించే విధంగా చూస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 60 నుంచి 120 గజాల ఇండ్ల స్థలాలు ఉన్నవారిని కమిటీ గుర్తించి నియోజకవర్గానికి 3 వేల మందికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. 58 జీవోల దరఖాస్తుల ఆధారంగా ఇండ్ల పట్టాలను నిరుపేదలకు అందిస్తామని, ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే 40 పైచిలుకు స్థలాల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మేడ్చల్ జిల్లాలోని 141 మంది ఉద్యమకారులను గుర్తించి డబుల్ బడ్రూం ఇండ్లు కేటాయించినట్లు చెప్పారు.
కార్యకర్తల వల్లే..
ఉద్యమకారులు, కార్యకర్తల వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని, వారందరినీ బీఆర్ఎస్ అధిష్టానం కాపాడుకుంటుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కార్యకర్తలకు ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.
సత్తా చూపిస్తాం
దేశంలో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తుందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని, దేశంలో బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించిన నాటి నుంచి ముఖ్యమంత్రి కుటుంబంపై మోదీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పపడుతున్నదన్నారు. ఇలాంటి వాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడరని, మరింత దీటుగా బీజేపీని ఎదుర్కొంటారని స్పష్టం చేశారు.
టీఎస్పీఎస్సీపై అనవసర రాద్ధాంతం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ద్వారా కష్టపడి చదువుకున్న వారు, అర్హులైన వారికే ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాష్ర్టాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తుంటే సోషల్ మీడియాలో వ్యతిరేక వార్తలు రాస్తే సహించేది లేదని పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. విలువలు లేకుండా ఇష్టానుసారంగా ఉండే సోషల్ మీడియా వార్తలను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. ఎలాంటి వారైనా అసత్య వార్తలు రాస్తే చర్యలు తప్పవన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గాదయాకర్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, మేయర్లు జక్క వెంకట్రెడ్డి, కావ్య, బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, ప్రణిత, పావని, లక్ష్మి, కొండల్రెడ్డి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.