ఖైరతాబాద్, జనవరి 20 : దేశం దిశ, ప్రజల తలరాత మార్చాలంటే..బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో మార్పు తీసుకురావడానికి, తెలంగాణ పథకాలు దేశం మొత్తం అమలు చేయడానికి జాతీయ పార్టీ పెట్టిన సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు అసత్యపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
రాష్ర్టానికి వాటాగా వచ్చే నిధులు కూడా సాధించని బీజేపీ దద్దమ్మలు ప్రధానిని ప్రశ్నించడం మానేసి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, దేశ ప్రజల కష్టాలను తీరుస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ముడుపు రాజిరెడ్డి, రోజా రెడ్డి, సత్యప్రకాశ్, వసంత రెడ్డి పాల్గొన్నారు.