కంటోన్మెంట్ ( హైదరాబాద్) : తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలంతా మద్దతుగా నిలవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితకు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
శనివారం కంటోన్మెంట్లోని బోయిన్పల్లి తెలంగాణ గార్డెన్లో నియోజకవర్గ ముస్లిం మైనార్టీల (Muslim minorities) ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, షాదీముబారక్ తదితర పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారని పేర్కొన్నారు.
50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, తొమ్మిదేండ్ల టీడీపీ పాలనలో తెలంగాణ వెనకబడిపోయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ముస్లింలను వంచించాయని దుయ్యబట్టారు. మైనార్టీలకు అన్నివిధాల అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎంతో కృషి చేశారని కొనియాడారు. మోదీ పాలనలో ముస్లింలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలాలు కలిగిన వ్యక్తి అని ఆరోపించారు. ఇమామ్, మౌజన్లకు గౌరవవేతనం ఇచ్చారని గుర్తుచేశారు. మైనార్టీలకు అన్నివిధాల అండగా నిలిచిన కేసీఆర్ సర్కారు వెంటే మైనార్టీలంతా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో సీనియర్ నాయకులు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, సీనియర్ నాయకులు మసీఉల్లాఖాన్, ఆకుల హరి, టీఎన్ శ్రీనివాస్, నర్సింహ ముదిరాజ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.