సిటీ బ్యూరో, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ) : నగరంలో వాతావరణ కాలుష్య తీవ్రత ఒక్కసారిగా మారింది. గత వారంతో పోల్చితే రెండు రోజుల్లో కాలుష్య కారకాలు గాలిలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా సూక్ష్మ ధూళి కణాలతోనే ఎక్కువగా విస్తరించి ఉండగా… నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ వంటి రసాయనాలు నిర్ణీత ప్రమాణాల కంటే ఎక్కువగా చేరాయి. దీపావళి టపాసులు, వాహన కాలుష్య ప్రభావంతోనే గాలి నాణ్యత సూచీలో మార్పులు వచ్చినట్లుగా నిపుణులు వివరించారు.
హైదరాబాద్లో సెంట్రల్, స్టేట్ పీసీబీల ఆధ్వర్యంలో 14 ప్రాంతాల్లో రియల్ టైం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తున్నాయి. ఇందులో అన్ని ప్రాంతాల పరిధిలోనూ వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగినట్లుగా వెల్లడైంది. దీంతో సాధారణ జనాల కంటే శ్వాస కోశ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని, ముఖ్యంగా చిన్న పిల్లలకు శ్వాస ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులతో పోల్చితే నగరంలోనే పీఎం2.5, పీఎం10 కాలుష్య కారకాల తీవ్రత సగటున మూడింతలు పెరిగింది.
ఢిల్లీ, ముంబై నగరాల్లో మరింత దారుణంగా వాతావరణ కాలుష్యం పెరిగింది. గత నెల రోజులుగా గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఈ క్రమంలోనే టపాసుల కొనుగోళ్లపై నిషేధం విధించారు. అయినా కూడా వాతావరణంలో ఏమాత్రం మార్పు చెందలేదని వెల్లడైంది. సీపీసీబీ నిబంధన కంటే దారుణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోగా, సగటున 380గా ఢిల్లీలో నమోదు కాగా, చెన్నైలో హైకోర్టు మార్గనిర్దేశకాల నేపథ్యంలో సాయంత్రం 6-8గంటల మధ్యనే టపాసులు కాల్చాలనే ఆంక్షలతో కొంత మెరుగ్గా వాతావరణం ఉంది.