సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : అత్యాధునిక టెక్నాలజీతో ఈవ్టీజర్లను గుర్తించి పట్టుకుంటున్నామని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసి 8 ఏండ్లవుతందని, ఈవ్టీజర్ల కోసం అధునిక స్పై క్యామ్లను అందుబాటులోకి తెచ్చి నిఘాను పటిష్టం చేశామన్నారు. ఇందులో షేక్ నజామ్ నయీం, మెహిన్ షేక్ అనే ఇద్దరిని నూతన స్పైకామ్లతో పట్టుకొని, కోర్టులో హాజరుపరచడంతో 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పిందని తెలిపారు.
షార్ట్ ట్రావెల్ కోసం వాహనం బుక్ చేసుకుంటే, ఆ వాహన డ్రైవర్ యాప్రాల్కు చెందిన కార్తిక్ బందాని బాధితురాలి ఫోన్ నెంబర్ తీసుకొని అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
పరిచయాన్ని ఆసరా చేసుకొని ప్రేమించాలని వేధిస్తున్న అమీర్పేట్కు చెందిన బి. శేఖర్పై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఓ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన హెచ్ఆర్ ఉద్యోగినికి గుర్తుతెలియని నెంబర్తో ఫోన్ చేసి వేధిస్తుండడంతో మేడ్చల్కు చెందిన సత్తిరెడ్డిని అరెస్ట్ చేశారు.
స్నేహంగా ఉంటూ ఆర్థిక సహాయం చేసిన పాపానికి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్న మాణికేశ్వర్నగర్కు చెందిన సాదానత్ను అరెస్ట్ చేశారు.
షాప్లోకి వెళ్లి సేల్స్ గర్ల్తో అసభ్యకరంగా ప్రవర్తించిన వారాసీగూడకు చెందిన ఎండీ ఫరీదుద్దీన్ను
అరెస్ట్ చేశారు.