కీసర, జనవరి 30 : కీసరగుట్ట జాతర, బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్యా తెలిపారు. కీసరగుట్టలో సోమవారం పార్కింగ్ ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. కీసరగుట్టకు వెళ్లే రోడ్డు మార్గం నుంచి గురుకుల పాఠశాల వెనుకభాగంలో ఉన్న పార్కింగ్ స్థలం వరకు కలెక్టర్ కాలినడకన వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు జిల్లా యం త్రాంగం ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపా రు. కీసరగుట్ట పుణ్యక్షేత్రం నగరానికి అతి చేరువలో ఉండటంతో శివభక్తులు భారీ సంఖ్య లో రావడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు.
భారీ సంఖ్యలో వాహనాలు కీసరగుట్టకు వచ్చే అవకాశం ఉందని, అందుకు పార్కింగ్ను నిర్వహించే నిర్వాహకులు వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా తగిన రీతిలో ఏర్పాట్లను చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కీసరగుట్ట జాతర ఏర్పాట్ల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర చాలా కీలకంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ, కీసర సర్పంచ్ నాయకపు మాధురి, ఎంపీడీవో రమాదేవి, జిల్లా పరిషత్ ఏఈ జగపతిబాబు, మండల పంచాయతీ అధికారి మంగతాయారు, ఉప సర్పంచ్ తటాకం లక్ష్మణ్శర్మ, కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం రమేశ్శర్మ, పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి సురేశ్రెడ్డి, మాజీ ఎంపీటీసీ బి. రమేశ్గుప్త, తదితరులు పాల్గొన్నారు.