రూ.19 లక్షలు మంజూరు
రైల్వే స్థలం కావడంతో ఆపివేసిన సంబంధిత అధికారులు
మొండిబండనగర్లో మధ్యలోనే ఆగిన పార్కు పనులు
పనులు పునఃప్రారంభించాలని స్థానికుల వేడుకోలు
అడ్డగుట్ట, ఏప్రిల్ 13 : నిధులు మంజూరయ్యాయి.. చిన్న పిల్లల పార్కు పనులు ప్రారంభించారు. ఇంతలోనే రైల్వే అధి కారులు అడ్డగించి పనులను నిలిపివేశారు. రైల్వే స్థలం అంటూ పార్కు పనులను అడ్డగించారు. వివరాల్లోకెళ్లితే..అడ్డగుట్ట మొండిబండనగర్ సమీపంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించతలపెట్టిన చిల్డ్రన్స్ పార్కు నిర్మాణ పనులకు అడగడుగునా అడ్డంగులే ఎదురవుతున్నాయి. నాలుగేండ్ల క్రితం సుమారు రూ.19 లక్షలతో ప్రారంభించిన పనులు రైల్వే అధికారుల అభ్యంతరంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
పనులు ఆగిపోయి సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ స్థలంలో క్రీడమైదానం ఉండేది. అదే స్థలంలో చుట్టు పక్కల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి పార్కు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అనుకున్నట్టుగానే అధికారులు నిధులు చేసి పనులు ప్రారంభించారు. ఇంతవరకు భాగానే ఉంది. అయితే ఆ పార్కు స్థలం రైల్వే ఆధీనంలో ఉండడంతో వెంటనే పనులను నిలిపివేయాలని జీహెచ్ఎంసీ అధికారులను రైల్వే అధికారులు ఆదేశించారు. దీంతో పార్కు పనులు ప్రహరీ వరకే పరిమితమయ్యాయి.
పనుల ప్రారంభానికి చర్యలేవి…?
రైల్వే యంత్రాంగం ఆదేశాలతో నిలిపివేసిన పనులను జీహెచ్ఎంసీ అధికారులు పునఃప్రారంభం దిశగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. నిధులున్నా….పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో రైల్వే అధికారులతో చర్చిస్తున్నామని చెప్పుకొస్తున్నా అధికారుల మాటలకు..చేతలకు ఎక్కడా పొంతన లేకుండాపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కు ఏర్పాటు చేయడం ద్వారా వృద్ధ్దులు, చిన్నారులు, యువతకు అన్నివిధాలుగా ప్రయోజకనకరంగా ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత విభాగం ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
రైల్వే అధికారులతో చర్చిస్తున్నాం
రైల్వే అధికారులు ఆదేశాల మేరకు పార్కు పనులను నిలిపివేశాం. తిరిగి పార్కు పనుల ప్రారంభానికి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. వాటిపై స్పష్టత వచ్చిన వెనువెంటనే పనులను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం.
– వేణు, జీహెచ్ఎంసీ ఏఈ.