చార్మినార్, ఏప్రిల్ 21 : చేబదులుగా తీసుకున్న నగదు చెల్లించకపోగా అవమానించే మాటలతో మానసికంగా వేధించడంతో హత్యలకు పాల్పడ్డ వ్యక్తిని మీర్చౌక్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఏసీపీ శ్యాం సుందర్ వివరాలు వెల్లడించారు. చార్మినార్ మసీద్ పహడిషరీఫ్ ప్రాంతానికి చెందిన అదిల్ఖాన్ (35) ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుండేవాడు. అతని సోదరుడు అఖీల్ఖాన్, మరదలు అజ్మీరాబేగంలు పోలీస్స్టేషన్ పరిధిలోని సుల్తాన్పుర ప్రాంతంలో నివసిస్తున్నారు.
మరణించిన తన సోదరునికి సంతానం కలిగినా, తనకు లేకపోవడం వెలితిగా భావించేవాడు. అయితే అఖీల్ఖాన్, అదిల్ఖాన్ వద్ద పలుమార్లు తీసుకున్న చేబదులు తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం, వీరి మధ్య మరదలి జోక్యంతో కోపం పెంచుకున్న అదిల్ఖాన్ ప్లాన్ ప్రకారం సోమవారం అఖీల్ ఖాన్ ఇంటికి వచ్చే సమయంలో ఓ పదునైన కత్తి తెచ్చుకున్నాడు. సోమవారం జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడైన అదిల్ఖాన్ ఇద్దరిని హత్యచేసి పారిపోయాడు. మంగళవారం విచారణలో భాగంగా నిందితుడి నివాసానికి వెళ్లగా, అక్కడే ఉన్న నిందితుడిని మీర్చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి రక్తపు మరకలు ఉన్న వస్ర్తాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ శ్యాం సుందర్ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ కొండల్రావు, డీఐ సైదయ్య, ఎస్సైలు సంతోష్ కుమార్, అనిత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.