సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఒరిస్సా బరంపూర్ జిల్లా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.18లక్షల విలువైన 17.42కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ కథనం ప్రకారం… ఒరిస్సాకు చెందిన రాహుల్ సేతి(27) ఒరిస్సా రాష్ట్రం, బరంపూర్ జిల్లా నుంచి నాందేడ్ ప్రాంతానికి గంజాయి రవాణా చేసేందుకు మహారాష్ట్రలోని ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు ఒరిస్సా నుంచి రైలులో గంజాయి తీసుకుని శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగాడు.
అనంతరం రైల్వేస్టేషన్ వెనుక భాగంలో ఉన్న మారేడుపల్లి స్టేషన్లో గంజాయిని తీసుకువెళ్లే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ ఎస్సైలు శ్రీనివాస్, రూప, భూపాల్ హెడ్ కానిస్టేబుల్ హాఫీస్, కానిస్టేబుల్ మురళి, జంగయ్య, శేఖర్, శోభ, శశిధర్లు కలిసి నిందితున్ని పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు. నాందేడ్ నుంచి ఇద్దరు వ్యక్తులు గంజాయి తీసుకెళ్లేందుకు వస్తున్నారని, వారికి ఈ గంజాయిని అప్పగించడానికి ఇక్కడ నిరీక్షిస్తున్నట్లు రాహుల్ సేతి పోలీసులకు తెలిపాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.18లక్షల విలువ చేసే 17.4 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును మారేడుపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.