హైదరాబాద్ : ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద ఆరు గ్యారంటీ పథకాలకు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలో 10 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar ) తెలిపారు. బుధవారం ముషీరాబాద్ సర్కిల్ భోలక్పూర్ వార్డులోని అంజుమన్ స్కూల్లో నిర్వహించిన దరఖాస్తు స్వీకరణ కౌంటర్ను కమిషనర్ రోనాల్డ్రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు (Indiramma Houses) , 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పెన్షన్, మహాలక్ష్మీ, సబ్సిడీ గ్యాస్(Subcidty Gas ) లకు సంబంధించిన దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి నేటితో నెల రోజులు పూర్తయ్యాయని, ఈ సమయంలోనే ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ఆమలులోకి తెస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన 45 గంటల్లో మహాలక్ష్మీ పథకాన్ని ఆమల్లోకి తెచ్చి ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది ఉచిత ఆర్టీసీ(Rtc) ప్రయాణాన్ని వినియోగించుకున్నారని వివరించారు.
ప్రతి ఇంటి నుంచి ఒక దరఖాస్తును స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీ పథకాలతో పాటు ఇతర అంశాలు రేషన్కార్డు, బస్తీ సమస్యలపై కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 150 వార్డులలో 600 కేంద్రాల్లో దరఖాస్తు స్వీకరణ కౌంటర్లు ఏర్పాటు చేశామని, అవసరం మేరకు మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, స్పెషల్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.