హైదరాబాద్: రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను (Shiva Balakrishna) ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన అధికారులు.. లాకర్లు తెలిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బినామీల పేరుతో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వారిని విచారించి కీలక వివరాలు సేకరించారు. ఆయనపై బినామీ చట్టం ప్రయోగించే యోచనలో ఉన్నారు.
మణికొండలోని ఆదిత్యపోర్ట్ వ్యూలో విల్లా నంబర్ 25లో శివబాలకృష్ణ నివాసం ఉంటున్నారు. 2018 నుంచి 2023 వరకు హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన, ఆరు నెలల క్రితం రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ) కార్యదర్శిగా బదిలీ అయ్యారు. మెట్రోరైల్ ప్లానింగ్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శివబాలకృష్ణపై అవినీతి ఆరోపణలు రావటంతో ఆయన ఆస్తుల చిట్టాపై ఇటీవల ఏసీబీ ఆరా తీసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆధారాలు సేకరించి.. సోదాలు నిర్వహించింది. ఇందులో రూ.20 కోట్ల నగదు, ఖరీదైన సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, వాచ్లు, కిలోలకొద్దీ బంగారు, వెండి ఆభరణాలు, విలువైన బహుమతు లు, వందల సంఖ్యలో డాక్యుమెంట్లను గుర్తించినట్టు తెలిసింది. నిందితుడిన నేడు కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.