సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ )/కొండాపూర్ : టీఎస్ ఆర్టీసీ అన్ని వర్గాలకు మరింత దగ్గరయ్యేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ సంస్థ పురోభివృద్ధికి తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సైబర్ లైనర్ ఏసీ మినీ బస్సులను సోమవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. హైటెక్సిటీ సమీపంలో ఎండీ సజ్జనార్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలతో కలిసి సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ బస్సుల్లో వైఫై, జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నట్లు తెలిపారు.
18 సీట్ల సామర్థ్యం గల ఈ సైబర్ లైనర్ బస్సులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు రాయదుర్గం నుంచి వేవ్రాక్, డీఎల్ఎఫ్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ప్రస్తుతం 10 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని మున్ముందు వీటి సంఖ్యను పెంచుతామని తెలిపారు. అనంతరం నిత్యం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గిరిజ, మౌనిక, ప్రీతిక, శ్రీకాంత్, రాజా, ప్రసాద్ , ఇంద్రకాంత్ , హర్షిణి, అనిక్ష , మహ్మద్ జైద్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్పటేల్, జగదీశ్వర్గౌడ్, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ మురళీవరద రాజన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు యాదగిరి, మునిశేఖర్, ఎస్సీఎస్సీ ప్రతినిధి కృష్ణ యెడ్ల, తదితరులు పాల్గొన్నారు.