మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 23 : ఆధార్ అప్డేట్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌర సేవలు పొందాలంటే ఆధార్ అప్ డేట్ తప్పని సరి అని అన్నారు. ఉద్యోగాల దరఖాస్తులు, బ్యాంకు ఖాతాలు, ధ్రువపత్రాలు, పొందేందుకు, స్థలాల రిజిస్ట్రేషన్, సిమ్ కార్డులు పొందాలంటే ఆధార్ అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్డు వివరాలు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్కారు.
2015 సంవత్సరం కంటే ముందు ఆధార్ పొంది అప్ డేట్ చేయని వారు వెంటనే ఆధార్ నమోదు, నవీకరణలు వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, పుట్టిన పిల్లలకు ఆధార్ పొందేలా దవాఖానల్లో చర్యలు చేపడుతున్నట్లు, అన్ని దవాఖానల్లో ఈ ప్రక్రియ జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆధార్ ప్రక్రియ చేపట్టి వంద శాతం పూర్తి చేసేలా చూడాలని, 15 ఏండ్లలోపు పిల్లలకు ఆధార్ అప్డేట్ పూర్తి ఉచితంగా అవకాశం ఉందని, విద్యా సంస్థలతో సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని సూచించారు. అప్ డేట్ ప్రక్రియ సంబంధించిన ఆధార్ సేవా కేంద్రాలకు తగిన సూచనలు చేయాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ భాను ప్రకాశ్ రెడ్డిని ఆదేశించారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1947, HELP@uidai.net.in ను వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, యుఐడీఏఐ హైదరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ సత్యకళ, ఏసీపీ రాచకొండ జావిద్, డీఈవో విజయ కుమారి, ఎల్డీఎం కిశోర్ కుమార్, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నారాయణరావు పాల్గొన్నారు.