కేపీహెచ్బీ కాలనీ, జూలై 28 : పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు కేంద్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను సవరించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో మాదిరిగా కాకుండా ఓటరు జాబితాలో పేర్లను ఆధార్ నంబర్తో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆధార్ కార్డు లేనిపక్షంలో మరో పది గుర్తింపు కార్డుల సహాయంతో కొత్తగా ఓటరుగా పేరును నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఇతరాత్ర విషయాల్లో సవరణలు తీసుకొచ్చారు. అర్హులందరికీ ఓటు హక్కును కల్పించడం, నకిలీ ఓట్లను తొలగించి పూర్తి స్థాయిలో ఓటరు జాబితాను రూపొందించే దిశగా చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో కొత్త నిబంధనలను అనుసరిస్తూ ఓటరు జాబితాను రూపొందించే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఏడాదిలో నాలుగుసార్లు..
జనవరి 1లోగా 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా గుర్తిస్తూ జాబితాలో పేరును నమోదు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం యేడాదిలో నాలుగుసార్లు 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి ఓటరుగా జాబితాలో పేరును నమోదు చేస్తారు. గతంలో జనవరి 1 తర్వాతనే జాబితాలో పేరును చేర్చే అవకాశముండగా తాజా నిబంధనలతో జనవరితో పాటు ఏప్రిల్, జూలై అక్టోబర్ 1వ తేదీలోపు 18 సంవత్సరాలు నిండితే ఓటరు జాబితాలో పేరును నమోదు చేస్తారు. ఆన్లైన్, ఎన్వీఎస్పీ.ఇన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుంటే 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటరుగా గుర్తింపు లభిస్తుంది.
ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు..
ఓటరు నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదని ఐచ్ఛికంగా గుర్తించారు. ఆధార్ కార్డు లేకున్నా మరో పది గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకోవచ్చు. వీటిలో.. గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పోస్టాఫీస్/బ్యాంక్ పాస్బుక్ (ఫొటోతో కూడిన), ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ విత్ ఫొటోగ్రాఫ్, సర్వీస్ ఐడెంటిటీ కార్డు విత్ ఫొటోగ్రాఫ్, అఫీషియల్ ఐడెంటిటీ కార్డు, యూనిక్ ఐడెంటిటీ ఐడీ కార్డులతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఆగస్టు 1 నుంచి కొత్త దరఖాస్తులు..
ఓటరు నమోదు, ఓటరు జాబితాలోని పేర్లు, చిరునామాలో సవరణలు, ఓటరుగా పేరు తొలగింపు కోసం ఆగస్టు 1నుంచి కొత్త దరఖాస్తు ఫారంలను అందుబాటులోకి తెస్తున్నారు. గతంలో కొత్త ఓటరు నమోదు, సర్వీస్ ఓట్ల కోసం 6, 6ఏ దరఖాస్తు ఫారంలు ఉండగా కొత్తగా 6బి దరఖాస్తు ఫారంను తెచ్చారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఆధార్ నంబర్తో అనుసంధానం చేస్తూ ఓటరుగా అవకాశం కల్పిస్తారు. ఫారం 7తో ఓటరు చనిపోయినా, అడ్రస్ మారినా, ఎవరైనా ఫిర్యాదు చేసినా జాబితా నుంచి పేరును తొలగించే అవకాశమిచ్చారు. ఫారం 8ఏతో జాబితాలో మూడు రకాల సవరణలకు అవకాశమిచ్చారు. అలాగే ఆర్మీ ఉద్యోగుల కోసం స్పౌజ్ అనే యాక్షన్ను తీసుకొచ్చారు. అలాగే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ బాక్సులను భద్రపర్చడం, కౌంటింగ్ కోసం అందుబాటులో ఉన్న భవనాలను తీసుకునే అవకాశం కల్పించారు.
అందరూ సహకరించాలి..
పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు ఓటర్లు, ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు సహకరించాలని కూకట్పల్లి నియోజకవర్గం ఈఆర్వో కె.రవికుమార్ తెలిపారు. గురువారం మూసాపేట సర్కిల్ కార్యాలయంలో వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కొత్త నిబంధనలన వివరించారు. నకిలీ ఓట్లను తొలగించి అర్హులకు ఓటు హక్కును కల్పించే దిశగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని కోరారు.
– కె.రవికుమార్, ఈఆర్వో, కూకట్పల్లి నియోజకవర్గం