Hyderabad | ఘట్కేసర్ రూరల్, నవంబర్ 9: కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడి మర్మాంగాలపై కారం చల్లి, కర్రలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎం.మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. గజ్వేల్కు చెందిన దరావత్ సుశీల, తన కుమారుడు కరణ్(18)తో కలిసి 15 ఏండ్ల కిందట అన్నోజిగూడలోని లక్ష్మీనర్సింహ కాలనీకి వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇంటికి సమీపంలోనే మహారాష్ట్రకు చెందిన కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన ఓ బాలిక(15)తో కరణ్కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ తరచూ కలుసుకుంటున్నారు.
బుధవారం రాత్రి బాలిక ఇంట్లో ఎవరూ లేరు. దీంతో యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. యువకుడిని గమనించిన బాలిక తల్లిదండ్రులు, సోదరులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాలికను వేరే గదిలో బంధించి.. కరణ్ను మరో గదిలో వేసి కర్రలు, బెల్టుతో చితకబాదారు. మర్మాంగాలపై కారం చల్లుతూ రాత్రి 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు దాడి చేశారు. చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో యువకుడిని అతడి ఇంటి ముందు పడవేశారు. ఇంట్లోకి వెళ్లి అపస్మారక స్థితిలో పడిపోయిన కరణ్ను గమనించిన తల్లి.. ఇరుగుపొరుగు సహాయంతో ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించింది.
దవాఖానలో పరీక్షించిన వైద్యులు యువకుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోచారం ఐటీసీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు విచక్షణ రహితంగా దాడి చేసి, హత్య చేసినట్టు గుర్తించారు. దాడికి పాల్పడిన బాలిక సోదరుడు శింగాడే కరణ్(18), తండ్రి శింగాడే దోండిభా(45), తల్లి రాధాబాయి(34), బంధువులు సురేశ్ (30), నామ్దేవ్ (22), సుధీర్(20), మాధవ్(30), కందు (45), జల్బా(32), గజానంద్(27)ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసు దర్యాప్తులో ఉన్నదని ఇన్స్పెక్టర్ తెలిపారు.