బడంగ్పేట: ఏ కష్టమూ చేయకుండానే క్షణాల్లో..నిమిషాల్లో కోటీశ్వరులమైపోదామనుకున్న కొందరు అత్యాశపరులు మాయలు, మంత్రాలను గుడ్డిగా నమ్మి 11 లక్షల రూపాయలు నష్టపోయారు. వివరాలిలా ఉన్నాయి.
మీర్పేట సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బీఎన్రెడ్డి నగర్లోని హస్తినాపురం కాలనీకి చెందిన శ్రీనివాస్రెడ్డి వ్యాపారం చేస్తుంటాడు. పాతనగరంలో ఓ ముస్లిం మహిళకు అతీత శక్తులున్నాయని ఆమె లక్షలను కోట్లుగా మార్చి ఇస్తుందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. అదంతా నిజమేనని నమ్మాడు. మరో ఏడుగురు స్నేహితులతో కలిసి 11 లక్షలు సమకూర్చుకుని మధ్యవర్తులైన రాజు, వినోద్, మహ్మద్ఖాన్ల సమన్వయంతో ఈ నెల 1న సాయంత్రం ఆరింటికి ఆమెను పూజకు పిలిచారు. హస్తినాపురంలోని విశ్వేశ్వరయ్య కాలనీలో శ్రీనివాస్ రెడ్డి తమ్ముడి షెడ్డుకు వచ్చి.. ఆమె పూజ ప్రారంభించింది.
పూజా సామగ్రిని తన ముందు పెట్టమని చెప్పి అందరినీ పూజలో కూర్చోబెట్టింది. తొలుత ఆమె 5వేల రూపాయలను 50 వేలు చేసినట్టు భ్రమ కల్పించి అక్కడున్న వారికి నమ్మకం కలిగించింది. అనంతరం 11 లక్షలను పూజలో పెట్టమని చెప్పగా శ్రీనివాస్రెడ్డి అతని స్నేహితులందరూ కలిసి రూ. 11లక్షలను పూజలో పెట్టారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుండగా రాత్రి 11 గంటలకు సుమారు 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇన్నోవా కారులో వచ్చారు. తాము పోలీసులమంటూ చెప్పి వారి దగ్గర ఉన్న కట్టెలతో విచక్షణా రహితంగా కొట్టారు.
శ్రీనివాస్రెడ్డి అతని స్నేహితులకు, మధ్య వర్తులకు గాయాలయ్యాయి. అదే సమయంలో డబ్బులు రెట్టింపు చేస్తానన్న ముస్లిం మహిళ పూజలో పెట్టిన రూ. 11 లక్షలను ఒక సంచిలో పెట్టుకుని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తుల కారులో ఎక్కి పారిపోయింది. కాగా మీర్పేటలో పోలీస్స్టేషన్లో శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.