కేపీహెచ్బీ కాలనీ, జూన్ 6 : విద్యుత్ షాక్కు గురైన బాలికను రక్షించే ప్రయత్నం చేసిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన శ్రీనివాస్ భార్యాపిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. నాలుగు రోజుల కిందట హైదర్నగర్లోని అడ్డగుట్ట సొసైటీ వెస్ట్రన్హిల్స్లో ఎలిగెంట్స్ ప్రైడ్ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిలో చేరాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్, కమల పిల్లలు శ్రీలక్ష్మి, మహాలక్ష్మి (5) మరో ఇద్దరుముగ్గురు చిన్నారులతో కలిసి అపార్ట్మెంట్ పక్కన ఆడుకుంటున్నారు.
ఈ క్రమంలో అక్కడే చెట్టు పక్కనున్న టీవీ కేబుల్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ తీగలను శ్రీలక్ష్మి పట్టుకోగా విద్యుత్ షాక్కు గురైంది. ఇది గమనించిన వీఆర్కే గార్డెన్లో వాచ్మన్గా పనిచేస్తున్న బాపనమ్మ (32) ఆ బాలికను రక్షించడానికి వెళ్లింది. విద్యుత్ షాక్తో కొట్టుకుంటున్న శ్రీలక్ష్మిని విడిపించడానికి ప్రయత్నించగా.. బాపనమ్మ విద్యుత్ షాక్కు గురైంది. ఈ సంఘటనలో బాపనమ్మ మృతి చెందగా.. బాలిక విద్యుత్ షాక్ గాయాలతో సమీపంలోని వైద్యశాలలో చికిత్స పొందుతోంది. టీవీ కేబుల్, బ్రాండ్బ్యాండ్ కేబుళ్ల ద్వారా విద్యుత్ ఎలా సరఫరా అయిందన్న అంశంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ విషయంపై టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ షాక్కు గల కారణాలను తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.