బొల్లారం, మే 21 : చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ దవాఖానకు వస్తున్న దంపతులపై చెట్టు విరిగి పడడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం బొల్లారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్పేట, తూముకుంట ప్రాంతానికి చెందిన రవీందర్(56) ప్రైవేటు ఉద్యోగి. సరళా దేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
మంగళవారం ఉదయం 10గంటల సమయంలో సరళాదేవికి కీళ్ల వ్యాధికి సంబంధించిన ఇంజెక్షన్ నిమిత్తం ద్విచక్ర వాహనంపై బొల్లారం కంటోన్మెంట్ దవాఖానకు వచ్చారు. దవాఖానలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా వారిపై కూలిపడింది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతిచెందగా.. సరళాదేవి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మూడు సెకన్లలోనే చెట్టు కూలిపోయిన దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.