వర్షం ఉధృతంగా కురిసినా..వరద ముంచెత్తకుండా వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కోసం సర్కారు చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ) పనులన్నీ పురోగతిలో ఉన్నాయి. రూ.985.45 కోట్లతో మొత్తం 57 ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టగా, 22 ఏరియాల్లో పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. సుమారు 80 శాతం పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికే మూడు చోట్ల అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా చార్మినార్, ఎల్బీనగర్, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో 14 చోట్ల ప్రారంభానికి సిద్ధమయ్యాయి. హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా, బల్కాపూర్ నాలా పనులు మినహా వచ్చే నెలాఖరులోగా తొలి విడత పథకం పనులు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు.
సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : నగరంలో వరద ముంపు సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. నగర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2020 అక్టోబరులో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురవడం, కాలానికి అతీతంగా గంట వ్యవధిలోనే కుండపోత వర్షాలు కురుస్తున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో సైతం వరద ముంపు బెడత లేకుండా ఉండేందుకు ఎస్ఎన్డీపీ పనులకు బల్దియా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే వచ్చే నెలాఖరులోగా మొదటి విడత పథకాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ఖరారు చేయగా…భూ సేకరణ సమస్య కారణంగా రెండు చోట్ల పనులు మాత్రమే ఇటీవల ఊపందుకున్నాయి. హుస్సేన్సాగర్ సర్ప్లస్ నాలా, బల్కాపూర్ నాలా పనులు మినహా వచ్చే నెలాఖరులోగా తొలి విడత పథకం పనులన్నింటినీ పూర్తి చేయడమే టార్గెట్గా అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే రూ. 985.45కోట్ల పనులు 14 ప్రాంతాల్లో మినహా దాదాపుగా 80 శాతం మేర పూర్తయ్యాయి.
జీహెచ్ఎంసీ, శివారులు కలిపి 57 చోట్ల పనులకు ఇప్పటికే 3 ప్రాంతాల్లో వరద ముంపును శాశ్వతంగా పరిష్కరించగా.. 22 చోట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక చార్మినార్, ఎల్బీనగర్, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో 100 శాతం పనులు పూర్తి చేసుకుని 14 చోట్ల నాలా అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. తొలి దశను చివరి దశకు చేర్చిన అధికారులు ఎస్ఎన్డీపీ రెండోదశలో రూ.5135.15కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో జీహెచ్ఎంసీకి సంబంధించి 148 పనులకుగానూ రూ. 2141.22కోట్లతో, శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో రూ.2993.93 కోట్లకు 267 చోట్ల పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు లభించగానే భూ సేకరణ పనులు మొదలు పెట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నల్ల పోచమ్మ టెంపుల్ వీఎస్టీ నుంచి విద్యానగర్ నాలా బ్రిడ్జి, నాగమయ్యకుంట హెరిటేజ్ షాపు నుంచి వెజిటేబుల్ మార్కెట్ రోడ్ నాలా బ్రిడ్జి, పికెట్ నాలా కరాచీ బేకరీ ఎస్పీ రోడ్ బ్రిడ్జి, ఫాక్స్ సాగర్ సర్ప్లస్ కెమికల్ నాలా, ఫాక్స్సాగర్ వెన్నెలగడ్డ చెరువు,అల్వాల్ మోదుకుల కుంట నుంచి కొత్త చెరువు, ఎల్బీనగర్ బాతుల చెరువు నుంచి ఇంజాపూర్ నాలా, మన్సురాబాద్ చిన్న చెరువు నుంచి బండ్లగూడ చెరువు ,బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు, చాంద్రాయణగుట్ట నూరినగర్ నుంచి డెక్కన్ ప్లేస్, రాజేంద్రనగర్ అప్పా చెరువు నుంచి మల్గంద్ లేక్, పటాన్చెరువు రాయసముద్రం -నక్కవాగు, ఇసుక వాగు, చందానగర్-ఈర్ల చెరువు-ఎన్హెచ్-65 చేపట్టిన పనులను పూర్తి చేశారు.వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.