ఖైరతాబాద్, జూలై 2: వైద్య వృత్తిలో రాణిస్తూ ఎంతో మందికి ఆరోగ్యవంతమైన జీవితాలను ప్రసాదిస్తున్న వైద్యులు భావి వైద్య విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్ సూచించారు. డాక్టర్స్ డే సందర్భంగా ఆదివారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్ ఆడిటోరియంలో ముదిరాజ్ వైద్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తెలంగాణ ముదిరాజ్ మహాసభ, ముదిరాజ్ డాక్టర్స్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, ముదిరాజ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. జాతి ఔన్నత్యాన్ని చాటిన కేవల్ కిషన్, బండి సాయన్న, కృష్ణస్వామి, పోలీస్ కిష్టయ్య, సూరటి అబ్బయ్య లాంటివారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
అనంతరం, ఆయన తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్తో కలిసి సమాజానికి సేవలందిస్తున్న ముదిరాజ్ వైద్యులను శాలువా, మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ డాక్టర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రమణ, ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్, డాక్టర్ రవిప్రసాద్, డాక్టర్ జగన్మోహన్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు డాక్టర్ ప్రతిభ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లెబోయిన అశోక్, డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, ముదిరాజ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ దినేశ్ కుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దమ్మిగారి కనకయ్య, కోశాధికారి బొక్క శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంబర్పేట సతీశ్ తదితరులు పాల్గొన్నారు.