మేడ్చల్, మే19(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా నీటి కటకట మొదలైంది. తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్, కు త్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమైంది. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అయిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది.
గతంలో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యంలో ఔటర్ వెలుపల గ్రామాలకు తాగునీటిని అందిస్తుండగా ప్రస్తుతం ఔటర్ వెలుపలి గ్రామాలను జీహెచ్ఎంఎసీలో కలిపిన నాటి నుంచి ప్రధానంగా మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నీటి సమస్య తీవ్రమైంది. వేసవి కాలం ప్రారంభమైన నాటి నుంచి తాగునీటిని వారంలో ఒక రోజు మాత్రం ఇస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్ సర్కిల్తో పాటు ఘట్కేసర్, మేడిపల్లి, కుత్బుల్లాపూర్లోని సూరారం, జీడిమెట్ల, ఇండస్ట్రీయల్ ఏరియా, మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతమ్నగర్, నేరెడ్మెట్ ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్, హబ్సిగూడ, చిలుకానగర్, ఉప్పల్, వెంకట్రెడ్డినగర్లతో పాటు బస్తీలలో నీటి సమస్య తీవ్రమవడంతో వేసవి కాలం మరో 20 రోజులు ఉన్న నేపథ్యంలో వానలు పడే వరకు నీటి తిప్పలు ఎలా భరించేది అని ఆందోళన చెందుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి కొరత లేదు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి కోరత అనేదే లేకుండే అని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో నీటి ఎద్దడి సమస్య రాకుండా ఉండేలా రూ. 2 వేల కోట్లతో వివిధ ప్రాంతాలకు కిలోమీటర్ల పైపు లైన్ నిధులతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాగునీటిని సరఫరా చేయించగా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు పరిపాలన వైఫల్యాలతో రాష్ర్టాన్ని మళ్లీ కరువు పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ప్రైవేట్ ట్యాంకర్లే దిక్కు..
మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో నీటి ఎద్దడికి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటర్ ట్యాంకర్లతో ప్రతి రోజు నీటిని సరఫరా చేసుకుంటూ నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల మహిళలకు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన పట్టించుకునే అధికారులే లేరని వాపోతున్నారు. వాటర్ ట్యాంకర్లను ప్రతి రోజు ఆశ్రయించిన పరిస్థితి రావడంతో ట్యాంకర్ల యజమానులు ధరలు పెంచిన తప్పని సరి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులపై ప్రభుత్వం ధరలు తగ్గించే విధంగా నైనా ఒత్తిడి తేస్తే బావుంటుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.