ఖైరతాబాద్, జనవరి 20: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తామంటే సహించబోమని వక్తలు పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడుగులకు తమ డిమాండ్లు చెప్పుకునే స్వేచ్ఛనివ్వాలన్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత కేబినెట్లో నామమాత్రంగా మాదిగలకు అవకాశం కల్పించారని, మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం, రెండు ఎంపీలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు తమ సత్తా చూపిస్తారన్నారు. ఈ సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు వెంకటయ్య, మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు యాదగిరి మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ గెల్వయ్య, బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజలింగం, శ్రీనివాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.