వ్యవసాయ యూనివర్సిటీ , మే 22 : సాగులో విప్లవాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ నాబార్డ్ డిప్యూటీ మేనేజర్ దీప్తి సునీల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విస్తరణ విద్యాసంస్థలో నిర్వహించిన అమ్మకందారులు, కొనుగోలు దారుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు లాభసాటి సాగుకు అందరూ మనవంతుగా సహకరించాలని సూచించారు.
ఇతర పరిశ్రమలు అధిక ఉత్పత్తి చేసినప్పుడు బోనస్ లభిస్తోందని , వ్యవసాయ రంగంలో మాత్రం అధిక ఉత్పత్తి కారణంగా నష్టాలు భరించాల్సి రావడం దురదృష్టకరమని ఆమె అభిప్రాయపడ్డారు. త్వరగా పాడైపోయే టమాట, పూలు, కూరగాయలు , ఆకుకూరలు వంటి ఉత్పత్తుల మార్కెట్ జటిలమైన సమస్య అన్నారు. వ్యవసాయాన్ని సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సిఫారసు చేసిన మేరకు పంట సాగు, మార్పిడి విధానాలను అవలంభించాలని సూచించారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా లాభ సాటి వ్యవసాయం చేయాలన్నారు. భూసార పరీక్షలు చేయించి.. మోతాదు ఎరువులు యాజమాన్యం చేపట్టాలని పేర్కొన్నారు. కొవిడ్ నుంచి అన్ని రకాల పరిశ్రమలు మూతపడినా వ్యవసాయ రంగం మాత్రం మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేశారు. సాగు అన్ని విధాల అభివృద్ధి కావాలని విస్తరణ సంస్థ సంచాలకులు డా.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులను శుభ్రం చేయడం, గ్రేడింగ్ చేయడం, ఎండబెట్టడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడితే మంచి ధర వస్తుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఆరు నెలల పాటు గిడ్డంగులలో నిల్వ చేసుకోవడానికి పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన రైతు ఉత్పత్తి దారుల సంఘాల రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీజేటీఎస్ఏయూ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా.సీమ, విస్తరణ సంచాలకులు విసుధారాణి, ఐసీఏఆర్, విస్తరణ విద్యాసంస్థ సంచాలకులు నరేందరర్ రెడ్డి, డా.ఎంవీరెడ్డి, ఉపేంద్ర, చైతన్య , శైలజ పాల్గొన్నారు. మార్కెట్ ఇంటలిజెన్స్ విభాగం సయ్యద్ హుస్సేన్ , మురళి పాల్గొని పలు సూచనలు చేశారు.