సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): నగరంలో నకిలీ ఔషధాల(Fake medicines) తయారీ కలకలం సృష్టిస్తోంది. కొన్ని కంపెనీలు ఆహార ఉత్పత్తుల తయారీ కోసం అనుమతులు తీసుకుని నకిలీ ఔషధాలు తయారు చేస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలు కొనసాగుతున్న ఈ నకిలీ ఔషధాల తతంగంపై ఆలస్యంగా కళ్లు తెరిచిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ(Drug Control Authority) అధికారులు కొన్ని రోజులుగా వరుసదాడులు జరుపుతున్నారు.
ఈ క్రమంలో గురువారం కూకట్పల్లి, ఐడీఏ ప్రశాంతినగర్లోని ఎస్ఎల్ హెల్త్ కేర్పై డ్రగ్ కంట్రోల్ అథారిటీ(డీసీఏ)అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఎస్ఎల్ హెల్త్ కేర్ కంపెనీ ఆహార ఉత్పత్తుల కోసం అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా ‘ఆర్థో-డీ’(గ్లుకోజమైన్ 750ఎంజి, మిథైల్ సల్ఫోనిల్ మిథేన్ 250ఎంజి, డయాసరిన్50ఎంజి మాత్రలు), ‘ప్రెగవిట్-ఎం’ (ప్రెగబలిన్ 75ఎంజి, మిథైల్కోబామిన్ 750ఎంసిజి క్యాప్సల్స్)ను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఈ ఔషధాలు తయారు చేయాలంటే తప్పనిసరిగా డీసీఏ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
కానీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆహార ఉత్పత్తుల ముసుగులో అర్హతలేని వారితో ఔషధాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు డీసీపీ నిర్ధారించింది.
ఈ మేరకు రూ.2.90లక్షల విలువైన ఔషధాలను సీజ్ చేసినట్లు డ్రగ్ కంట్రోల్ అథారిటి డీజీ వి.బి.కమలాసన్రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎన్.సహజ, ఎం.శ్రీబిందు, డీసీఏ విజిలెన్స్ సెల్ అధికారులు పి.రాము, కార్తిక్ శివచైతన్య తదితరులు పాల్గొన్నారు.