పేదల సొంతింటిని నిర్వీర్యం చేసే కాంగ్రెస్ చేపట్టిన మూసీ ప్రాజెక్టుతో మరో ప్రజా యుద్ధం మొదలయ్యేలా ఉంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలతో విసిగిపోతున్న మూసీ పరివాహాక ప్రాంత బాధితులు ప్రజా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కేవలం కార్పొరేట్ సంస్థలకు మూసీ భూములను కట్టబెట్టి, వేల కోట్ల రూపాయలపై కన్నేసిన బడా నేతల భరతం పట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలో జంట జలాశయాల నుంచి నగరం దాటేందుకు వరకు మూసీ వెంబడి విస్తరించి ఉన్న బస్తీ, కాలనీ వాసులు ఐక్యమవుతున్నారు. ప్రభుత్వం సాగించిన అక్రమ మార్కింగ్లు, బలవంతపు తరలింపు ప్రయత్నాలను నిలవరించేలా బస్తీవాసులు ముందుకు వస్తున్నారు. ఒక ప్రాంతానికో, కాలనీకో పరిమితం కాకుండా, మూసీ వెంబడి ఈ మహా ఉద్యమాన్ని నిర్వహించేలా అడుగులు వేస్తున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : దశాబ్దాల కాలంగా అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇండ్లను రేవంత్ సర్కార్ అక్రమం అనే ఒక్క మార్కింగ్తో నేలమట్టం చేసే కుట్రలపై మూసీ పరీవాహక జనాలు మండిపోతున్నారు. రాజేంద్రనగర్ నుంచి ఉప్పల్ నియోజకవర్గంలోని మూసీ బస్తీల వరకు గల్లీగల్లీలో భయాందోళనల్లో కురుకుపోయిన జనాలు… సర్కార్పై తిరుగుబాటే తమకు శరణ్యమనే భావనకు వస్తున్నారు. ఇప్పటికే వేలాది కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ చర్యలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలుస్తూ పర్యావరణ, సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు తోడుగా విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్వీ పోరుబాట కార్యక్రమం గడిచిన ఐదురోజులుగా మూసీ వెంబడి ఉన్న పదుల సంఖ్యలో బస్తీలు, కాలనీల వాసులను కలిసి, వారి ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజల హక్కులను పరిరక్షించేందుకు ఓ వైపు న్యాయ పోరాటం చేస్తుండగానే.. మరోవైపు ప్రజా ఉద్యమ కార్యాచరణకు బస్తీ వాసులు సిద్ధమయ్యారు.
సర్కార్ కుట్రలకు మూకుతాడు
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిలవరించేందుకు ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు, న్యాయ నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు బాధితులకు ఇప్పటికే భరోసానిచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యావరణ పేరిట విధ్వంసాన్ని సృష్టించాలని, ప్రాజెక్టు పేరిట బీదలను రోడ్డున పడేసే కుట్రలకు మూకుతాడు వేయాలనే అభిప్రాయం బాధితుల్లో వ్యక్తం అవుతుంది. పేదల పొట్ట కొట్టి, కార్పొరేట్ సంస్థలకు మూసీ భూములను కట్టబెట్టే ఆలోచనలను తిప్పికొట్టాలని, బాధితులు ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉందని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ ముసుగులో జరుగుతున్న ఈ విధ్వంసానికి నిలువరించాలంటే ప్రజా ఆందోళనతోనే సాధ్యమనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ఈ క్రమంలోనే బస్తీ నుంచి మొదలుకొని, గేటెడ్ కమ్యూనిటీ నివాసితులందరూ… తమ గూడును కూల్చే కాంగ్రెస్ కుట్రలను అడ్డుకుంటామని చెబుతున్నారు. తామెక్కడికి వెళ్లేది లేదని, ఇక్కడే ఉంటామని, అవసరమైతే తమ ఇంట్లో ఉన్నప్పుడే కూల్చాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి బస్తీలో కమిటీల ఏర్పాటు, ఉద్యమ జేఎసీల ఆధ్వర్యంలో మూసీ వెంబడి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో ప్రజా యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మూసీ పేరిట తమ జీవితాలను చిన్నాభిన్నం చేసే ప్రణాళికల నుంచి కాంగ్రెస్ వెనక్కి తగ్గే వరకు ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.