దుండిగల్, ఆగస్టు 2 : ఓ మినీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. తండ్రితో కలిసి స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లిలోని ఇంద్రప్రస్థా అపార్ట్మెంటులో నివాసముంటున్న కిశోర్కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు దీక్షిత(8) బౌరంపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్(డీపీఎస్)లో మూడో తరగతి చదువుతున్నది. రోజువారీ మాదిరిగానే బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో దీక్షితను తన తండ్రి కిశోర్ స్కూటీపై కూర్చోబెట్టుకుని పాఠశాలకు బయలుదేరాడు. అదే సమయంలో బాచుపల్లిలోని వివిధ ప్రాంతాల నుంచి నిజాంపేట భాష్యం స్కూల్కు విద్యార్థులను తీసుకుని వెళ్తున్న మినీ బస్సు వీరి వెనుకాలే వస్తున్నది. ఈ క్రమంలో స్కూటీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి వెనుక నుంచి స్కూటీని ఢీ కొట్టింది.
దీంతో స్కూటీపై వెళ్తున్న తండ్రి, కూతురు కుడివైపు రోడ్డుపై పడిపోయారు. వెంటనే డ్రైవర్ బస్సును కుడివైపు తిప్పే ప్రయత్నం చేయగా.. బస్సు వెనుక చక్రాలు చిన్నారి తల పైనుంచి దూసుకెళ్లాయి. దీంతో చిన్నారి దీక్షిత అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తండ్రి కిశోర్ కుడిచేయి భజం వద్ద, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు దీక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించి, గాయపడిన కిశోర్ను బాచుపల్లిలోని మమత వైద్యశాలలో చేర్పించారు. చికిత్స అనంతరం కిశోర్ ఆస్పత్రి నుంచి తన కూతురు మృతదేహాన్ని తీసుకువెళ్లిన గాంధీ వైద్యశాలకు వెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. బస్సు డ్రైవర్ షేక్ రహీం(25) అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. యాదాద్రి జిల్లాకు చెందిన రహీం కొంతకాలంగా బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో ఉంటూ తానే సొంతగా మినీ బస్సును నడిపిస్తున్నాడని తెలిసింది. ప్రతిరోజూ బాచుపల్లిలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులను తీసుకొని నిజాంపేటలోని భాష్యం పాఠశాలకు, సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి చేరవేస్తాడు. బాలిక ఆత్మకు శాంతి చేకూరాలని స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.