BRS | సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో కీలక అంకం మొదలు కానున్నది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయా పార్టీలు ఇప్పటికే బరిలో నిలిచే అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రచారంలో ముందంజలో ఉన్నది. చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున భారీ బహిరంగ సభ చేపట్టి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ సభతో బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కంకణబద్ధులై ప్రజాక్షేత్రంలో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ మార్నింగ్ వాక్, సమన్వయ సమావేశాలు, బూత్ స్థాయి సమావేశాలతో ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు.
ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి పద్మారావు గౌడ్ నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలను పూర్తి చేసి ఇంటింటికీ గులాబీ జెండాతో పాదయాత్రకు సోమవారం శ్రీకారం చుట్టారు. మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఒకవైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ..మరోవైపు వీలైనంత త్వరగా ఓటర్లను చేరుకునేందుకు యత్నిస్తున్నారు. బూత్, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో గెలుపు కోసం సమాలోచనలు చేయడం, సాయంత్రం ఏడు తర్వాత ముఖ్య అనుచరుల నివాసాలు, గెస్ట్హౌజ్లు, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాలనీ, అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దుతు తెలుపుతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు స్వచ్ఛందంగా తరలివచ్చి బ్రహ్మరథం పడుతుంటే.. బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్లపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కొమ్ముకాసి సామాన్యుల జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసిందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఎంపీగా కిషన్రెడ్డి ఫెయిల్ అయ్యారని, ఆయన నియోజకవర్గం సింటెక్స్ ట్యాంకుల ప్రారంభాలు, సీతాఫల్మండి రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు లిఫ్ట్లు ప్రారంభించారే తప్ప.. నియోజకవర్గంలో ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేకపోయారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్పై ప్రజల కంటే అటు సొంత పార్టీ నాయకులే భగ్గుమంటున్నారు. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడిన బొంతు రామ్మోహన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
దీంతో పాటు చాలా కాలంగా పీజేఆర్ కూతురు విజయారెడ్డికి దానం వర్గీయుల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో ఉన్నంత కాలం దానం తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనే ఆవేదనతోనే విజయారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. మళ్లీ దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరికతో నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దానం నాగేందర్కు సొంత పార్టీలోనే మద్దతు కరువైందని..దీంతో ఆయన అధ్యక్షతన జరుగుతున్న సమన్వయ సమావేశాలకు కీలక నేతలు డుమ్మా కొడుతుండడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ గెలుపు కష్టమేనని, దానం నాగేందర్ మూడో స్థానానికి పరిమితం అవుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. మొత్తంగా ఈ సారి లష్కర్పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 15 : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం కూకట్పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎన్నికల ఇన్చార్జి బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాగిడి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని, రాష్ర్టాన్ని పదేండ్ల కాలంలో అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నదన్నారు.