సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ)/సికింద్రాబాద్/సనత్నగర్: సికింద్రాబాద్ నల్లగుట్టలోని స్పోర్ట్స్ సామగ్రి, కారు డెకర్స్కు సామగ్రికి సంబంధించిన గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెగ్జిన్, సింథటిక్, ఫైబర్, ప్లాస్టిక్కు సంబంధించిన భారీ మెటీరియల్ అందులో ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనున్న భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం భవనం చుట్టుపక్కల ఉన్న నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. 30 ఫైర్ ఫైటర్స్తో సాయంత్రానికి మంటలను అదుపులోకి తెచ్చారు. జలమండలి నుంచి 70 ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తూ మంటలు ఆర్పేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా, మంటలు వ్యాపించగానే గోడౌన్లో ఉన్న పలువురు బయటకు పరుగులు తీశారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది నలుగురిని కాపాడగా.. మరో ముగ్గురి ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.
మినిస్టర్ రోడ్డు డీవీ కాలనీలో ఉన్న ఆరు అంతస్థుల భవనం సెల్లార్లో జాహీద్, రహీం సోదరులు డెక్కన్ కార్పొరేట్ పేరుతో కార్ డెకార్స్, స్పేర్ పార్ట్స్ దుకాణంతో పాటు వివిధ రకాల దుకాణాలు, గోదాంలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సెల్లార్లో మంటలంటుకున్నాయి. భవనం ముందు భాగంలో ప్రధాన రహదారి ఉండగా.. చుట్టూ మూడు పక్కల భవనాలు, నివాస గృహాలు ఉన్నాయి. దీంతో ఈ భవనంలో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక శాఖతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో సహా ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడం ప్రారంభించారు. మరోపక్క భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టి, నలుగురిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మరో ముగ్గురు లోపల ఉన్నట్లు దుకాణం నిర్వాహకులు చెప్పడంతో వారిని కూడా రక్షించేందుకు అగ్నిమాపక శాఖ, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భవనంలోని నాలుగు, ఐదో అంతస్థులకు సంబంధించిన స్లాబ్ కూలిపోయి, మెట్లు దెబ్బతినడంతో పాటు భవనం మొత్తం బీటలు వారింది. ఏ క్షణంలోనైనా భవనం కూలిపోయే ప్రమాదం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.
పెద్ద ఎత్తున రెగ్జిన్, బట్టలు, కార్ డెకొర్ సామగ్రి, సింథటిక్, టీ షార్ట్స్పై డిజైన్లకు ఉపయోగించే కెమికల్స్ ఉండటంతో మంటలు క్షణాల్లో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. కెమికల్ డబ్బాలు పేలిపోయి పెద్ద పెద్ద శబ్ధాలు కూడా వచ్చాయి. భవనం చుట్టూ ఫైర్ ఇంజన్ వెళ్లేందుకు వీలుగా సరిపడే మార్గం లేకపోవడంతో ముందు భాగం నుంచే మంటలను అదుపు చేశారు. వాటర్ పైప్, చిన్న యంత్రాల సహాయంతో అతి కష్టంగా ఫైర్ ఇంజన్ను భవనం చుట్టూ తీసుకెళ్లి మంటలను అదుపు చేశారు. భవనానికి సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పొగంతా భవనంలోనే కమ్ముకుపోయింది. అందులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది గోడను తొలగించారు. దీంతో ఆ భవనంలో ఉన్న పొగ ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడున్న వారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.
నగరం నడిబొడ్డు కావడం.. జనావాసాల మధ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఊహించని ప్రమాదం జరిగేది. కానీ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమై దాదాపు 12 గంటల పాటు రెస్క్యూ చేసి ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. ఫైర్ సిబ్బంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని భవనం టెర్రస్ పైనుంచి తొలుత ముగ్గురిని రక్షించారు. ఆ తర్వాత నాలుగవ అంతస్థులో ఉన్న పెయింటర్ను బయటకు తీసుకువచ్చారు. జలమండలి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ శాఖలతో అగ్నిమాపక శాఖ సమన్వయం చేసుకుంటూ ప్రమాద తీవ్రతను తగ్గించారు.
అగ్నిప్రమాదం ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆరా తీశారు. అమెరికాలో ఉన్న ఆమె.. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం అధికారులతో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మేయర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి సంఘటనా స్థలిని పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కాలనీ వాసులను పరామర్శించారు.
అగ్నిప్రమాద ఘటనా ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సందర్శించారు. నగరంలో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి భవనాలు 25 వేలకు పైగా ఉన్నాయని, అనుమతులు లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవనం లోపల ఉన్న నలుగురిని సురక్షితంగా కాపాడారని, మరో ముగ్గురు లోపల ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారని తెలిపారు.
అగ్నిప్రమాద ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ విచారణకు ఆదేశించారు. ప్రమాదం గురించి తెలియగానే ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి పర్యవేక్షణలో సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది తెగువతో శ్రమించారచి చెప్పారు. ఈ ఘటనలో పలువురు మరణించినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించని గోదాంలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది వాహనాలతో వచ్చి మంటలను ఆర్పివేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి తెలిపారు. మొత్తం 30 అగ్నిమాపక వాహనాలను వినియోగించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదని.. షార్ట్సర్క్యూటే కారణమని చెప్పేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు.
రాంగోపాల్పేట్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని మూడు 11 కేవీ ఫీడర్ లైన్ల విద్యుత్ను నిలిపివేసినట్లు టీఎస్ ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జె.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.