బంజారాహిల్స్,ఫిబ్రవరి 13 : నిజాం(Nizam) మనవడికి సంబంధించిన ఆస్తులను కాజేసేందుకు ప్రయ త్నిస్తున్న వ్యక్తులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆయన కుటుంబసభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు(Case registered) చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ సమీపంలోని డైమండ్ హిల్స్లోని ఫిర్దౌస్ విల్లాలో నివాసం ఉంటున్న దిల్షాద్ ఝా అనే వ్యక్తి హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు మనవడు. వారి వంశానికి చెందిన ప్రిన్స్ షామత్ అలీఖాన్ గత ఏడాది జూలైలో మరణించాడు.
ప్రిన్స్ షామత్ అలీఖాన్ ఇంట్లో సుమారు 15 ఏళ్లపాటు పనిచేసిన సయ్యద్ ఎజాజ్ ఖాద్రి ఆయన ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రిన్స్ షామత్ అలీఖాన్ చనిపోకముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకుని ఆస్తులు తనవే అని వాదిస్తుండడంతో పాటు తమ మీద తప్పుడు కేసులు పెట్టాడని దిల్షాద్ ఝా ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారంరోజుల క్రితం రోడ్డుమీద వెళ్తున్న తమను సయ్యద్ ఎజాజ్ ఖాద్రి అడ్డగించడంతో పాటు ఆస్తులకు సంబంధించి సెటిల్ చేసుకోవాలని. దీనికోసం రూ.కోటి ఇస్తానని. లేకుంటే అడ్డుతొలగించుకోవాల్సి ఉంటుందని బెదిరించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీ 3341,504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.