Nagarjuna Akkineni | సినీ నటుడు నాగార్జునపై రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. సమంత- నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటామని నాగార్జున హెచ్చరించిన మరుసటి రోజే ఆయనపై కేసు నమోదు చేశారు. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నాగార్జునపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. జనంకోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కినేని నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టినట్లుగా అనిపిస్తుంది. ముందుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేసింది. కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కట్టడాలను కూల్చివేయడంపై అప్పట్లో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. అది పూర్తిగా ప్రైవేటు భూమి అని, అంగుళం కూడా చెరువు భూమిని తాము ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత నాగార్జున ఈ విషయంలో సైలెంట్గా ఉన్నారు. అయినప్పటికీ రేవంత్ సర్కార్ మాత్రం నాగార్జునను వదల్లేదు. ఇటీవల మంత్రి సురేఖ అక్కినేని కుటుంబం, సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఫిలిం ఇండస్ట్రీ ముక్త కంఠంతో మండిపడింది.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నాగార్జున మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ హద్దులు దాటి మాట్లాడారని.. దీనిపై క్షమాపణ చెప్పినా కేసు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ విషయంలో నాగార్జునను సైలెంట్ చేయడానికి… బెదిరింపు చర్యల్లో భాగంగా కేసు పెట్టారని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. దీంతో రేవంత్ సర్కార్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.