దుండిగల్, ఏప్రిల్ 20 : పెయింటింగ్ పనులు చేసే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండిగల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గాగిళ్లాపూర్లో దాసరి శంకరమ్మ ఇద్దరు కొడుకులతో నివాసం ఉంటున్నది. ఆమె భర్త రాజయ్య మరణించాడు. పెద్ద కొడుకు మానసిక వికలాంగుడు. చిన్న కొడుకు మల్లేశ్(25) పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. మల్లేశ్ కొంతకాలంగా పాషా అనే పెయింటర్తో కలిసి పని చేస్తున్నాడు.
బుధవారం రాత్రి 11 గంటలకు పాషాతో మాట్లాడి వస్తానని తల్లికి చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. గురువారం ఉదయం మల్లేశ్ మృతదేహం చర్చి గాగిళ్లాపూర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సమీపంలో చెత్తకుప్పల్లో పడి ఉన్నట్లు తెలుసుకున్న శంకరమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని గుర్తించింది. మృతుడి శరీరంపై గాయాలు చూసి పాష, ఇతర స్నేహితులు తన కొడుకును కొట్టి చంపారని శంకరమ్మ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పాషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.