HMDA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ఆదాయం రాబడిలో అవసరమైన అన్ని మార్గాలను బల్దియా అన్వేషిస్తున్నది. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2100 కోట్ల టార్గెట్ విధించుకోగా, ఇప్పటి వరకు దాదాపు రూ. 1400 కోట్ల మేర మాత్రమే వసూలయ్యాయి. వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడం, అందులో ప్రధానంగా వచ్చే నెల రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ..ఉన్న కీలక అధికారులంతా ఎన్నికల విధుల్లోకి వెళ్తారు. దీని ప్రభావం ఆస్తిపన్ను వసూళ్లపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆస్తిపన్ను వసూళ్లను పెంచాలని నిర్ణయించిన అధికారులు..
ఈ మేరకు బకాయిదారులకు ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ అందిస్తూ ఓటీఎస్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది బల్దియా. దీంతో బకాయి ఉన్న వారంతా తక్షణమే 10 శాతం వడ్డీతో మాత్రమే బకాయిలు క్లియర్ చేసుకునే వెసులుబాటు దొరికింది. 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి 31లోపు ఆస్తి పన్ను బకాయిదారులకు ఈ ఓటీఎస్ స్కీం వర్తించనున్నది. కాగా, జీహెచ్ఎంసీలో ఇప్పటివరకు రెండు సార్లు వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ను అమలు చేశారు. మొదటిసారి 2020 ఆగస్టు 1 నుంచి నవంబర్ 15 వరకు, 2022 జూలైలో రెండోసారి అమలు చేశారు. రెండు సార్లు కలిపి బల్దియాకు రూ. 700 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరోసారి అమలు చేస్తే..రూ. 500 కోట్ల వరకు ఆదాయం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.