Readymade House | సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనేది సగటు సామాన్యుడి కల. అద్దె ఇంట్లో ఉండలేక, ఆ అవస్థలు పడలేక అప్పుచేసి లేదా బ్యాంకు రుణం తీసుకొని అయినా సొంతిళ్లు నిర్మించుకోవాలని.. అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో కొనుగోలుదారుల్లో ఇటీవల గణనీయమైన మార్పు వచ్చిందని, రెడీ టూ మూవ్ (సిద్ధంగా ఉన్న) ఇంటికే యమ డిమాండ్ నెలకొన్నదని ఇటీవల నో బ్రోకర్ వార్షిక రియల్ ఎస్టేట్ నివేదికలో వెల్లడించింది.
రియల్ అమ్మకాల్లో అత్యధికంగా సిద్ధంగా ఉన్న ఇంటినే కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని, 84 శాతం మేర డిమాండ్ రెడీ టూ మూవ్ ఇండ్ల పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా తమ సర్వేలో 87 శాతం మంది సొంతింటి కల వైపే మొగ్గుచూపగా..13 శాతం మంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చినట్లు నో బ్రోకర్ రియల్ ఎస్టేట్ సంస్థ కో ఫౌండర్ సుభాశ్ గార్గ్ తెలిపారు. ఎక్కువ శాతం రూ. 60 లక్షల లోపు గల డబుల్ బెడ్రూం ఇండ్ల పట్ల ఆసక్తి చూపినట్లు తెలిపారు. వీటితో పాటు కొనుగోలులో గృహ వాస్తుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలా మంది బిల్డర్లు 50 శాతం కంటే ఎక్కువగా అమ్మకాలను సాధించారని, కొనుగోలుదారుల డిమాండ్కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకువస్తున్నారని వివరించారు.
ప్రత్యేకంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐటీ కారిడార్లో విశాలమైన ఇంటికి ఆదరణ ఉన్నదని, కొనుగోలుదారుల కోరిక మేరకు విశాలమైన నివాసాల నిర్మాణం ఇక్కడ జరుగుతున్నదని, ప్రత్యేకించి ఐటీ కారిడార్లో చదరపు అడుగుకు రూ.11వేల పైగా ఉందన్నారు. రెడీ టూ మూవ్.. అత్యధికంగా కూకట్పల్లి, కొండాపూర్, మియాపూర్, మణికొండ, నిజాంపేటలో ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే పుప్పాలగూడ, నిజాంపేట్, హఫీజ్పేట, మాదాపూర్, నానక్రాంగూడ ప్రాంతాల్లో అద్దె ఇండ్లకు డిమాండ్ ఉండడంతో ఈ ఏరియాల్లో కూడా కొనుగోళ్లు పెరిగినట్లు వివరించారు.