సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బీఆర్ఎస్ కారు దూసుకుపోతున్నది. సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి రథం 600 కార్ల కాన్వాయ్తో 65వ నంబరు జాతీయ రహదారిపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది. అబ్ కీ బార్ కిసాన్ సరార్ నినాదంతో దారిపొడువునా గులాబీ జెండాల రెపరెపలతో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్కి పటాన్చెరు నుంచి మొదలు మహారాష్ట్ర వరకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. మహారాష్ట్రలో సరిహద్దు గ్రామం ఒమర్గాలో మధ్యాహ్న భోజన విరామం అనంతరం కారు మళ్లీ దౌడు తీసింది. మురం క్రాస్ వద్ద మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి బయలుదేరగానే సాయంత్రం హోరువాన కురుస్తున్నా కాన్వాయ్ జోరు మాత్రం తగ్గలేదు. రాత్రి సోలాపూర్కు చేరుకోగానే గ్రామస్తులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి చప్పట్లతో బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం వరకు సీఎం కేసీఆర్ అక్కడే బస చేయనున్నారు.